నూతన విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష

15 Sep, 2020 14:39 IST|Sakshi

సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చట్టం అమలు, ప్రయోజనాలపై చర్చించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యకు ప్రభుత్వం ఇదివరకే పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకురావడంతో సీఎం దానిపై  మంగళవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. (సవాళ్లను అధికమించేందుకే నూతన విద్యా విధానం)

సీఎం సమీక్ష అనంతరం మంత్రి అదిమూలపు సురేష్ సాక్షి టీవీతో మాట్లాడారు. ‘కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న మెజారిటీ అంశాలు దానిలో ఉన్నాయి. ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలని మనం ముందుగానే నిర్ణయం తీసుకున్నాం. కొత్త పాలసీ ప్రకారం ప్రీ ప్రైమరీ అంగన్ వాడీ విద్యకు, స్కూల్ విద్యకు మధ్యలో ఓ ఏడాది అనుసంధానం చేయాలని నిర్ణయించాం. పీపీ1, పీపీ2 తో పాటు మరొక ఏడాది పెంచుతున్నాం. హై స్కూల్ లెవెల్లో 3, 5, 8 తరగతుల్లో పరీక్షలు ఉంటాయి, అవి కేవలం వారి సామర్ధ్యాన్ని పరీక్షించడానికి మాత్రమే. 10 తరగతిలో బోర్డు పరీక్షలు యధావిధిగా ఉంటాయి. ఉన్నత విద్యను కూడా నైపుణ్యంతో ఉండేలా చర్యలు చేపట్టాం. మన రాష్ట్రం నుంచి చదువుకునే విద్యార్థులు అన్ని విధాలా సమర్థంగా ఉండేలా తీర్చి దిద్దుతాం. ’ అని పేర్కొన్నారు. 


 

మరిన్ని వార్తలు