సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం జగన్‌ సమీక్ష

16 Sep, 2020 18:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వృథాగా పోతున్న వరద జలాలను ఒడిసి పట్టాలని, చిత్రావతి, గండికోట ప్రాజెక్టుల్లో నీరు నింపాలని ఆదేశాలు జారీ చేశారు. సజావుగా భూసేకరణ చేపట్టి, సహాయ, పునరావాస ప్యాకేజీలు ఇవ్వాలన్నారు. రైతులను ఇబ్బంది పెట్టే చర్యలు వద్దని, వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో పోలవరం, ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులు సమావేశంలో వివరించారు.(చదవండి: బెస్ట్‌ సీఎం వైఎస్‌ జగన్‌: నటుడు అలీ)

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం–2, పూల సుబ్బయ్య వెలిగొండ–హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు, వంశధార–నాగావళి లింక్, బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టు స్టేజ్‌–2 రెండో దశ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా కొనసాగించాలి. భారీ వర్షాలతో పొటెత్తుతున్న వరదనీటిని ఒడిసి పట్టాలి’’అని సూచించారు. ‘‘చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలు, గండికోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది కచ్చితంగా కనీసం 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలి. వెంటనే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలు ఇవ్వాలి. గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు కేవలం రూ.6.75 లక్షల పరిహారం ఇస్తే, ఇప్పుడు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నాం. ఈ విషయం గురించి రైతులకు అవగాహన కల్పించాలి. వారికి నచ్చచెప్పాలి. ఈ రెండు ప్రాజెక్టుల్లో నీరు నిండితే వారికే ప్రయోజనం కలుగుతుందన్న విషయంపై రైతులకు వివరించాలి’’అని అధికారులకు సూచించారు. (చదవండి: విద్యలో విప్లవం)

ప్రాజెక్టుల పురోగతి
సమీక్షా సమావేశంలో భాగంగా.. ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు వేగంగా జరుగుతున్నాయని, అదే విధంగా... వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలనుకున్న అవుకు–2వ సొరంగం పనులు కూడా కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రికి తెలిపారు. అయితే మధ్యలో సీపేజీ వల్ల సొరంగంలో మట్టి చేరిందని పేర్కొనడంతో, నిపుణుల కమిటీ సలహా ప్రకారం అవసరమైన పనులు చేపట్టి పనులు పూర్తి చేయాలని సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేశారు. 

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు
ఇక ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులో మొదటి సొరంగం పనులు ఇప్పటికే పూర్తి కాగా, రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ఈ సీజన్‌లో నల్లమల అడవుల్లో కొండలపై నుంచి నీరు పడుతుండడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని ముఖ్యమంత్రికి తెలిపారు.

ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు
ప్రాధాన్యతా క్రమంలో ఉత్తరాంధ్రలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని సమావేశంలో అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఈ ఏడాది డిసెంబరు నాటికి వంశధార–నాగావళి అనుసంధానం పూర్తయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయని సమీక్షలో పేర్కొన్నారు. మొత్తం 33.5 కి.మీ కు గానూ ఇంకా 8.5 కి.మీ పనులు పూర్తి కావాల్సి ఉందని, వాటన్నింటినీ ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.

ఇక బీఆర్‌ఆర్‌ వంశధార స్టేజ్‌–2 ప్రాజెక్టుకు సంబంధించి రెండో దశ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, వంశధార, జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి అంతర్‌రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి, ఒడిషా సీఎంతో సమావేశానికి లేఖ రాయగా, ఇంకా సమాధానం రావాల్సి ఉందని వెల్లడించారు.

మహేంద్ర తనయ రిజర్వాయర్‌
శ్రీకాకుళం జిల్లాలో మహేంద్ర తనయ నదిపై ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పూర్తైతే నందిగాం, మెలియాపుట్టి, పలాస, టెక్కలి మండలాల్లోని 108 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని, 24,600 ఎకరాలకు నీరందుతుందని సీఎం జగన్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.850 కోట్లు కాగా, ఇప్పటికే దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని కూడా ప్రాధాన్యత కింద పరిగణించి పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇక తారకరామ తీర్థసాగర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టును 2022 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఆ మేరకు పనులు కొనసాగిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. సర్దార్‌ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్‌ ప్రాజెక్టులోడిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తైతే కొత్తగా 55 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని వివరించారు. ప్రాజెక్టులోభాగమైన గజపతినగరం బ్రాంచ్‌ కాల్వ పనులు 43 శాతం పూర్తి కాగా, మిగిలిన పనులు, భూసేకరణ కోసం రూ.139 కోట్లు వ్యయం చేయాల్సి ఉందని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు
పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్, కాలువలకు సంబంధించి 71 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు సమీక్షా సమావేశంలో వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంలో ఏ మార్పు లేదని, ఆ దిశలోనే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టు గేట్ల ఫ్యాబ్రికేషన్‌ ఇప్పటికే పూర్తైందన్న అధికారులు, వచ్చే ఏడాది ఏప్రిల్‌ చివరి నాటికి మొత్తం 48 గేట్ల బిగిస్తామని చెప్పారు. కొంత మంది కార్మికులకు కోవిడ్‌ రావడం వల్ల స్పిల్‌ వే కాంక్రీట్‌ పనుల్లో కాస్త జాప్యం జరిగిందని  వివరించారు.

ఉద్యోగుల సర్దుబాటు
జల వనరుల శాఖలో పనులు కొనసాగుతున్న చోట్ల అవసరాలను బట్టి, అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని, డ్యామ్‌లు, కాల్వలు, వాటర్‌ రెగ్యులేషన్‌కు అవసరమైన లష్కర్‌ను ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా నియమించుకోవాలని నేటి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.  అదే విధంగా డ్యామ్‌లకు అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్‌ సిబ్బంది నియామకానికి సీఎం అనుమతి ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు