CM YS Jagan Review Meeting: రహదారులపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష.. కీలక నిర్ణయాలు ఇవే..

12 May, 2022 07:43 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రహదారులపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, ఆర్‌ అండ్‌ బి మంత్రి దాడిశెట్టి రాజా, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ..‘‘రాష్ట్రంలో రోడ్లన్నింటినీ బాగు చేయడానికి ప్రభుత్వం చాలా ప్రణాళికబద్ధంగా పనిచేస్తోంది. ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ ముందుకుసాగుతోంది. దీనికోసం ప్రభుత్వం, అధికారులు చాలా కష్టపడుతున్నారు. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా మనపై విమర్శలు చేస్తున్నారు, వక్రీకరణలు చేస్తున్నారు. వీటిని చాలెంజ్‌గా తీసుకుని ఎక్కడా గుంతల్లేని విధంగా రోడ్లను తయారు చేయాలి. ఏడాదిలోగా రోడ్ల విషయంలో గణనీయ ప్రగతి కనిపించాలి. ఆర్‌ అండ్‌ బీ రోడ్లను బాగుచేయడం కోసం దాదాపుగా రూ. 2,500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. పీఆర్‌ రోడ్ల కోసం సుమారు రూ.1072.92 కోట్లు ఖర్చుచేస్తున్నాం.

రోడ్ల విషయంలో వక్రీకరించడానికి ప్రతిపక్షాలు, వాటికి సంబంధించిన మీడియా అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతీ జిల్లాలో గతంలో ఎంత ఖర్చు చేశారు? ఇప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నాం ? అన్నదానిపై వివరాలను ప్రజల ముందు ఉంచండి. ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీ రాజ్‌ రోడ్లు.. ఇలా అన్ని విషయాల్లో గతంలో ఎంత? ఇప్పుడు ఎంత ఖర్చు చేశామో ప్రజలకు వివరాలు అందించండి. గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి? బాగుచేసిన తర్వాత ఎలా ఉన్నాయి.. నాడు – నేడు పేరుతో ఫొటోగ్యాలరీ ఏర్పాటు చేయండి.

బ్రిడ్జిలు పూర్తై అప్రోచ్‌ రోడ్లు లేనివి, పెండింగ్‌ బ్రిడ్జిలు, ఆర్వోబీలు.. ఇవన్నీ కూడా పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. యుద్ధ ప్రాతిపదికిన దీని మీద దృష్టిపెట్టాలి. వచ్చే ఏడాదిలోగా ఇవి పూర్తికావాలి. రోడ్ల నిర్మాణంలో నాణ్యత చాలా ముఖ్యమైనది, నాణ్యత కచ్చితంగా పాటించాల్సిందే. నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం రోడ్లు వేయాలి. ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నివర్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న బ్రిడ్జిలు, కల్వర్టుల శాశ్వత పరిష్కారంపై దృష్టిపెట్టాలి’’ అని స్పష్టం చేశారు.

ఏపీలో రోడ్ల సంబంధిత అభివృద్ధిపై వివరించిన అధికారులు..

1. 7,804 కి.మీ. మేర ఆర్‌ అండ్‌ బీ రోడ్లుకు మరమ్మతులు. దీనికోసం దాదాపుగా రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. 1,168 పనుల్లో రూ. 947 కోట్ల విలువైన 522 పనులు ఇప్పటికే పూర్తి. సుమారు రూ.900 కోట్ల బిల్లులు చెల్లింపు. వర్షాకాలంలోగా పూర్తిచేయడానికి యుద్ధప్రాతిపదికన పనులు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపు.

2. నిడా –1 కింద 233 రోడ్లు, బ్రిడ్జిల పనులు. దీని కోసం రూ.2,479 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే రూ.2వేల కోట్లు ఖర్చు. ఆగస్టు నాటికి ఫేజ్‌–1 పనులు పూర్తిచేసేలా అడుగులు.
నిడా–2 కింద 33 ఆర్వోబీ పనులు. దీని కోసం దాదాపు రూ.816.51 కోట్లు ఖర్చు చేయడానికి ప్రణాళిక సిద్ధం. డిసెంబర్‌ నుంచి పనులు ప్రారంభించనున్న ప్రభుత్వం.

3. కొత్తగా 38 ఆర్వోబీల పూర్తికి రూ. 2,661 కోట్లు ఖర్చుచేస్తున్న ప్రభుత్వం. 

4. నివర్‌ తుఫాను కారణంగా ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో దెబ్బతిన్న బ్రిడ్జిలు తదితర నిర్మాణాల కోసం దాదాపు రూ.915 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం. దీని కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం.

5. ఎన్డీబీలో ఫేజ్‌–1 కింద 1,244 కి.మీ.ల కోసం రూ. 3,014 కోట్లు ఖర్చు. ఫేజ్‌ –1 కింద పనులు మే నెలాఖరు నాటికి ప్రారంభించనున్న ప్రభుత్వం.
– ఎన్డీబీలో ఫేజ్‌–2 కింద 1,268 కి.మీ. కోసం రూ.3,386 కోట్లు ఖర్చు. డిసెంబరులో ఫేజ్‌–2 పనులు ప్రారంభించనున్న ప్రభుత్వం. మొత్తంగా ఎన్డీబీ రోడ్ల కోసం రూ.6,400 కోట్లు ఖర్చు. దీనికోసం మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వచ్చే రోడ్లను 2 లేన్లుగా విస్తరిస్తున్న ప్రభుత్వం.

6. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా 99 పనులు. రాష్ట్రంలో ఉన్న అన్ని నేషనల్‌హైవేలను కనీసంగా 10 మీ. వెడల్పుతో అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం. మొత్తంగా 3079.94 కి.మీ. మేర విస్తరణకోసం రూ.రూ.30వేల కోట్లు ఖర్చు. ఇప్పటికే రూ.2041 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.

7.  రాష్ట్రాల అనుసంధానం కోసం మరో 6 ప్రాజెక్టులు. 2,157 కి.మీ నిడివి ఉన్న రోడ్ల ప్రాజెక్టుల కోసం రూ. 15,875 కోట్లు ఖర్చు. ఈ పనుల్లో భాగంగా బెంగుళూరు–చెన్నై, చిత్తూరు–చెన్నై, రాయ్‌పూర్‌–విశాఖపట్నం, షోలాపూర్‌ –కర్నూల్, హైదరాబాద్‌ –విశాఖపట్నం, నాగ్‌పూర్‌–విజయవాడ రహదారుల అభివృద్ధి.

8. రాష్ట్రంలో మరో 7 జాతీయ రహదారుల నిర్మాణానికి డీపీఆర్‌లు సిద్ధం. వీటికి ఏడాదిలోగా భూ సేకరణ పనులు పూర్తిచేసి పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతున్న అధికారులు. 3,004 కి.మీ. నిడివి ఉన్న ఈ రహదారుల కోసం దాదాపు రూ. 41,654 కోట్లు ఖర్చు. బెంగుళూరు – విజయవాడ, ఖమ్మం –దేవరపల్లి, మదనపల్లె–పీలేరు, రేణిగుంట– నాయుడుపేట, ముద్దనూరు–బి.కొత్తపల్లి–గోరంట్ల, తాడిపత్రి – ముద్దనూరు, మైదుకూరు–పోరుమామిళ్ల–సీతారాంపురం –మాలకొండ–సింగరాయకొండ రోడ్లు జాతీయ రహదారులగా అభివృద్ధి.

ఇవికాక పంచాయతీరాజ్‌ రోడ్లను రూ.1072.92 కోట్లతో బాగుచేస్తున్న ప్రభుత్వం. 2019 నుంచి 2022 వరకూ మొత్తంగా 3,705 కి.మీ మేర
పంచాయతీరాజ్‌ రోడ్ల కొత్త కనెక్టివిటీ, అపగ్రేడేషన్‌ కోసం రూ. 2131 కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం. ఇవికాకుండా 444 కి.మీ మేర బీటీ అప్రోచ్‌ రోడ్ల కోసం ప్రభుత్వం రూ.308 కోట్లు ఖర్చు చేసింది. 

ఇది కూడా చదవండి: హై అలర్ట్‌గా ఉండాలి.. సీఎం జగన్‌ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌

మరిన్ని వార్తలు