ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై కలెక్టర్లతో సీఎం జగన్ సమావేశం
వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూడాలి
అవినీతికి పాల్పడటం క్షమించరాని నేరం
నాణ్యత గల వస్తువులనే వాడండి
నిర్మాణంలో మన సంతకం కనబడాలి
స్పందన కార్యక్రమంలో కలెక్టర్లకు ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభం కార్యక్రమం జనవరి 20 వరకూ కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ 39 శాతం ఇళ్లస్థలాలు పంపిణీ పూర్తైందని పేర్కొన్నారు. 17వేలకు పైగా కాలనీల్లోని 9,668 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్లస్థలాల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పాలనలో పారదర్శకతను తారస్థాయికి తీసుకుని వెళ్లామని, ఇక ముందు కూడా దీనిని కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ మంగళవారం సమీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా.. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభ అంశంపై జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు.(చదవండి: ధాన్యం సేకరించిన పక్షంలోగా చెల్లింపులు)
మౌలిక సదుపాయాలు కల్పించాలి
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ‘‘ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గొప్ప కార్యక్రమం జరిగింది. ప్రతి కలెక్టర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది. వారి అందరి దీవెనలు మీకు లభిస్తాయి. నాతోపాటు, మీ అందరికీ కూడా ఈ సంతోషం ఉంటుంది. లే అవుట్స్లో ఇంటి నిర్మాణాలు కొనసాగించడం ఒక కార్యక్రమమైతే, వాటిలో మౌలిక సదుపాయలు కల్పించడం మరొక కార్యక్రమం. రోడ్లు, కరెంటు, తాగునీరు.. లాంటి కనీస సౌకర్యాలు కల్పించాలి. కాలనీ పరిమాణాన్ని బట్టి.. ఇతర సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా పెట్టాలి. స్కూళ్లు, అంగన్వాడీలు, పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ లాంటివి రావాలి. కాలనీ పరిమాణం, జనాభా బట్టి వీటిని ఏర్పాటు చేయాలి.
ఇందుకు సంబంధించి ఎస్ఓపీని తయారు చేయాలి. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేసరికి అవన్నీపూర్తి కావాలి. ఒక లే అవుట్లో పనులు ప్రారంభించిన తర్వాత అవన్నీ పూర్తికావాలి. కాలనీలో పనులు మొదలుపెట్టిన తర్వాత అందులో ఉన్న అన్ని ఇళ్లనూ పూర్తిచేయాలి. ఒకవేళ అదనంగా ఇళ్ల నిర్మాణాన్ని మంజూరు చేయాల్సి వస్తే.. వెంటనే దానికి అనుగుణంగా మంజూరుచేసి కాలనీలో అన్ని ఇళ్లనూ పూర్తిచేసేలా చర్యలు తీసుకుందాం’’ అని దిశా నిర్దేశం చేశారు.
ఆహ్లాదకర వాతావరణం ఉండాలి: సీఎం జగన్
వైఎస్సార్ జగనన్న కాలనీలను మురికివాడలుగా మార్చే పరిస్థితి ఉండకూడదని, ప్రతిచోటా ఆహ్లాదకర వాతావరణం ఉండాలని సీఎం జగన్ అన్నారు. రోడ్లను వినూత్న రీతిలో నిర్మించి, బాగా ఎలివేట్ చేయాలని సూచించారు. వీధి దీపాలు, కరెంటు స్తంభాల ఏర్పాటులో కూడా వినూత్న పద్ధతులను అనుసరించాలని, కాలనీలు కట్టేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్లు శ్రద్ధపెట్టి అన్ని పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. డిజైన్లు, ఇతరత్రా అంశాలపై ఇప్పటికే కొన్ని సూచనలు చేశానని, కలెక్టర్లు దీన్ని సవాల్గా తీసుకుని, సమర్థతను నిరూపించుకోవాలని పేర్కొన్నారు.
అవినీతికి పాల్పడితే పేదవాళ్ల ఉసురు తగులుతుంది