సీఎం జగన్‌ అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం

29 Jun, 2021 16:32 IST|Sakshi

పలు పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం ‘స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు’ సమావేశం జరిగింది. పలు పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఏర్పాటు కానున్న కంపెనీల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఏర్పాటవుతున్న పరిశ్రమల వల్ల పర్యావరణ ప్రభావాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవాలని సీఎం సూచించారు. జాగ్రత్తలు తీసుకుంటూ పారిశ్రామిక ప్రగతిలో ముందడుగు వేయాలన్నారు.

ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, కార్మికశాఖ మంత్రి జి జయరాం, సీఎస్‌ ఆదిత్యనాథ్‌‌ దాస్, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పలు ప్రతిపాదనలకు ఆమోదం
కడప సమీపంలో కొప్పర్తి వద్ద పిట్టి రెయిల్‌ ఇంజినీరింగ్‌ కాంపోనెంట్స్‌ లిమిటెడ్‌కు అంగీకారం
ఎలక్ట్రికల్, లోకోమోటివ్, విద్యుత్తు, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు ఇక్కడ తయారీ 
ఈ పరిశ్రమవల్ల ప్రత్యక్షంగా 2వేల మంది ఉద్యోగాలు
మొత్తంగా రూ.401 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ

కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నీల్‌కమల్‌ లిమిటెడ్‌కూ బోర్డు అంగీకారం.
నీల్‌కమల్‌కు దేశవ్యాప్తంగా పలు పరిశ్రమలు. అన్నికంటే ఇక్కడ పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేయనున్న నీల్‌కమల్‌. 
రూ. 486 కోట్ల పెట్టుబడి పెట్టనున్న నీల్‌కమల్‌. 
ప్రత్యక్షంగా 2030 మంది ఉద్యోగాలు. 
ఫర్నీచర్‌ మరియు ఇతర గృహోపకరణాల తయారీ

నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీంలో గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణకు బోర్డు ఆమోదం. 
ఫోర్డ్, హ్యుందాయ్, ఫోక్స్‌వాగన్‌ తదితర కంపెనీలకు స్టీల్, ఐరన్‌ ఉత్పత్తులు అందిస్తున్న గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌.
జపాన్, కొరియాలకు చెందిన అత్యాధునిక రోబోటిక్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తుల తయారీ.
జర్మనీ నుంచి ఐఎల్‌టీ ప్లాస్మా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్న గ్రీన్‌టెక్‌.
ప్రస్తుతం 2700 మందికి ఉద్యోగాలు, విస్తరణ ద్వారా అదనంగా 2200 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు. 

చిత్తూరు జిల్లా జిల్లా నిండ్ర మండలం ఎలకటూరులో అమ్మయప్పర్‌ టెక్స్‌టైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమకు బోర్డు అంగీకారం
సుమారు 30 కోట్ల పెట్టుబడి, 2304 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు
ఇందులో 90 శాతం మహిళలకే ఉద్యోగాలు
పురుషులు, పిల్లల బట్టలుతయారీ 

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి, తమ్మినపట్నం గ్రామాల వద్ద జిందాల్‌ స్టీల్‌ ఆంధ్రా లిమిటెడ్‌కు 860 ఎకరాలు తక్కువ ఖర్చుకు  ఇచ్చేందకు ఎస్‌ఐపీబీ ఆమోదం
2.25 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి జిందాల్‌ ఆంధ్రా లిమిటెడ్‌ ఏర్పాట్లు.. తద్వారా  2500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు

విశాఖపట్నం జిల్లా అచ్చుతాపురంలో నిర్మాణం అవుతున్న సెయింట్‌ గోబియాన్‌ పరిశ్రమకు ఏర్పాటుకు డెడ్‌లైన్‌ను పొడిగింపునకు ఎస్‌ఐపీబీ ఆమోదం
కోవిడ్‌ పరిస్థితులు కారణంగా ఫ్యాక్టరీ నిర్మాణ గడువును పెంచాలని కోరిన సెయిట్‌ గోబియాన్‌
జూన్‌ 2022 వరకూ పెంచుతూ నిర్ణయం

టెక్స్‌టైల్స్, గార్మెంట్స్‌ మార్కెట్‌ ప్లేస్‌లో భాగంగా మెగా రిటైల్‌ పార్క్‌ నిర్మాణానికి ఎస్‌ఐపీబీ ఆమోదం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 5 ఎకరాల స్థలంలో రిటైల్‌ బిజినెస్‌ పార్క్‌
రూ. 194.16 కోట్ల పెట్టుబడి
పార్క్‌లో భాగంగా 900 వరకూ రిటైల్‌ యూనిట్స్‌ 
సుమారు 5వేల మందికిపైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, మరో 20వేల మందికి పరోక్ష ఉద్యోగాలు 
దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కొనుగోలు, విక్రయాలకు హబ్‌గా ఈ పార్క్‌ ఏర్పాటు
రాష్ట్రంలో తయారయ్యే వాటిలో దాదాపు 70శాతం విక్రయాలు ఇక్కడనుంచే జరుగుతాయని అంచనా
పార్క్‌లో భాగంగా ఏర్పాటవుతున్న స్టోర్స్‌ నుంచి ఒక్కో స్టోర్‌లో ఏడాదికి సుమారు రూ.11 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా
ఎస్‌ఐపీబీలో రిటైల్‌ పాలసీకి సూత్రప్రాయ అంగీకారం.

సుమారు 25 వేల మందికి ఉద్యోగాలు: మంత్రి గౌతమ్‌రెడ్డి
సమావేశం అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కీలకంగా 5 పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చించామని పేర్కొన్నారు. భారీ పరిశ్రమలకు సంబంధించి రూ.14 వేల కోట్ల పెట్టుబడులపై సీఎం చర్చించారని తెలిపారు. జిందాల్ స్టీల్‌ప్లాంట్‌ 2.5 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రాబోతుందన్నారు. ఒక్క జిందాల్‌ ప్లాంట్‌లోనే రూ.7,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారని ఆయన వివరించారు. సుమారు 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. టీడీపీ విమర్శలు పట్టించుకోనవసరం లేదని గౌతమ్‌రెడ్డి అన్నారు.

చదవండి: ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్
సీఎం జగన్‌ సమక్షంలో ‘దిశ యాప్‌’ లైవ్‌ డెమో

మరిన్ని వార్తలు