ప్రగతి అంటే అందమైన అంకెల రూపం కాదు.. వాస్తవంగా చూపాలి: అధికారులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం

31 Oct, 2022 20:42 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: వివరాల నమోదు సమగ్రంగా ఉంటేనే.. అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉందో.. లక్ష్యాల సాధన దిశలో ఎక్కడున్నామో స్పష్టంగా తెలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం తన క్యాంప్‌ కార్యాలయంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఆయన సంబంధిత అధికారులతో  సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా.. ప్రతి అంశంలోకూడా సాధించాల్సిన ప్రగతిపై క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన, పర్యవేక్షణ చేయాలని అధికార యంత్రాంగానికి, సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు.

సీఎం వైఎస్‌ జగన్‌ మాటల్లో.. గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో మన ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో గొప్ప వ్యవస్థను తీసుకొచ్చింది. అలాంటి సచివాలయాల నుంచి నిరంతర పర్యవేక్షణ, చేస్తున్న ప్రగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడం చాలా ముఖ్యమైన అంశం. లేకపోతే సుస్థిర ప్రగతి లక్ష్యాలను చేరుకునే ప్రయాణంలో వాస్తవికత దూరం అవుతుంది. ప్రగతి అనేది కేవలం అందమైన అంకెల రూపంలో చూపడం కాదు, అవి వాస్తవాలుగా కనిపించాలని స్పష్టం చేశారాయన.

► ఆధార్‌ కార్డు నంబరు, వివరాలతో సహా డేటా నిక్షిప్తం చేయడంతోపాటు ... వచ్చిన మార్పులను చెప్పగలిగేలా ప్రగతి కనిపించాలి. ఏమైనా సమస్యలు ఉంటే.. వాటిని గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే గుర్తించి పరిష్కారాలు కూడా చూపాలి. ఉదాహరణకు.. రక్తహీనతను నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ అమలు చేస్తున్నాం. వీటిని అందుకుంటున్న మహిళల ఆరోగ్యంపై పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. ఆడపడుచులకు సరైన ఆహారం అందుతుందా? లేదా? అనేదానిపై గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే నిశిత దృష్టి ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ఆ స్థాయిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వంలో వివిధ విభాగాల తరపున గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఉన్నారు. తాము అనుకుంటున్న లక్ష్యాల సాధనకు గ్రామ, వార్డు సచివాలయాలను చోదక శక్తిలా వాడుకుని అందులోని సిబ్బందిని పూర్తి స్ధాయిలో భాగస్వాములు చేయాలి. సుస్ధిర లక్ష్యాల సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు యూనిట్‌గా ఉండాలి. అలాగే..

సచివాలయాల్లో సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణకు మండలాల వారీగా వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉండాలి. వీరు సచివాయాల్లోని ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ చేయాలి. దీనికి సంబంధించి ఎస్‌ఓపీలను రూపొందించుకోవాలి. ప్రభుత్వంలో ప్రతి విభాగానికి చెందిన విభాగాధిపతి ప్రతినెలలో రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలి. ఆ శాఖకు చెందిన సచివాలయ ఉద్యోగులు ఏరకంగా పనిచేస్తున్నారు? ప్రగతి లక్ష్యాల సాధన దిశగా ఏ రకంగా పనిచేస్తున్నారు? అనేది పరిశీలన చేయాలి. దీనివల్ల సిబ్బందికి సరైన మార్గదర్శకత్వం లభించడంతో పాటు అవగాహన కల్పించగలుగుతారు.  ఎప్పటికప్పుడు వివరాల నమోదు కూడా సమగ్రంగా జరుగుతుందా? లేదా? అన్నదానిపై కూడా పరిశీలన, పర్యవేక్షణ జరుగుతుంది. అంతేకాదు..

► లక్ష్యాల సాధన దిశలో మనం ఎక్కడున్నామో కూడా తెలుస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వాస్తవిక రూపం దాల్చిన అంశాలకు సంబంధించి వివరాల నమోదు ఎలా జరుగుతుంది? అనే విషయంపై జేసీలు, కలెక్టర్లు కూడా పరిశీలన చేయాలి. దీనివల్ల సచివాలయాల సిబ్బందిలో మెరుగైన పనితీరు కనిపిస్తుంది. అంతేకాదు ప్రగతి లక్ష్యాల సాధనలో మనం అడుగులు ముందుకుపడతాయి. దేశంలో రాష్ట్రం నంబర్‌ వన్‌గా నిలుస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాలను ఓనర్‌షిప్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రభుత్వ విభాగానికి మండలాల వారీగా అధికారులను నియమించుకోవాలి. వీలైనంత త్వరగా ఈ అధికారుల నియామకం కావాలి.

► గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి నిర్దేశించిన ఎస్‌ఓపీలను మరోసారి పరిశీలించి వాటిలో మార్పులు, చేర్పులు అవసరమైతే చేయండి. నెలకు కనీసం రెండు సచివాలయాలను ప్రభుత్వ విభాగాధిపతులు పర్యవేక్షించాలి. కలెక్టర్లు, జేసీలు ఎలా పర్యవేక్షణ చేస్తున్నారో కూడా పరిశీలన చేయాలి. వ్యవసాయం, విద్య, మహిళ శిశు సంక్షేమం, ఆరోగ్యం తదితర రంగాల్లో మనం ఖర్చు చేస్తున్నట్టుగా దేశంలో ఏ ప్రభుత్వంకూడా ఖర్చు చేయడంలేదు. అందుకనే ఓనర్‌షిప్‌ తీసుకుని వాటిని సమగ్రంగా పర్యవేక్షణ చేయాల్సి అవసరం ఉంది. ప్రగతి లక్ష్యాల సాధనపై ప్రతి నెల రోజులకోసారి వివరాలు నమోదు కావాలి. ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి సాంకేతికతను వాడుకోవాలి. పిల్లలు బడి మానేశారన్న మాట ఎక్కడా ఉండకూదు. డ్రాప్‌అవుట్స్‌ అన్న మాట ఎక్కడా వినిపించకూడదు.  సచివాలయాల వారీగా, వాలంటీర్ల వారీగా పర్యవేక్షణ చేయాలి. ఎప్పటికప్పుడు దీనిపై దృష్టిపెట్టాలి. ఎక్కడైనా డ్రాప్‌అవుట్‌ జరిగిన ఘటన తెలిస్తే.. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా విద్యార్థుల హాజరును పరిశీలించాలి. పిల్లలు ఎవరైనా వరుసగా 3 రోజులు స్కూలుకు రాకపోతే కచ్చితంగా మూడోరోజు ఇంటికివెళ్లి ఆరాతీయాలి. పిల్లలు స్కూలుకు రాకపోతే కచ్చితంగా ఎస్‌ఎంఎస్‌లు పంపాలి. ఇది కచ్చితంగా జరిగేలా చూడాలి. 

► కళ్యాణమస్తుకోసం నిర్దేశించిన అర్హతలు బాల్యవివాహాల నివారణ, అక్షరాస్యత పెంపుకోసం తోడ్పాటు నందిస్తాయి. వధూవరుల కనీస విద్యార్హత పదోతరగతిగా నిర్ణయించాం, అంతేకాదు పెళ్లికూతురు కనీస వయస్సు 18 ఏళ్లు, పెళ్లికొడుకు కనీస వయస్సు 21 సంవత్సరాలను పాటించాలని చెప్పాం. అలాగే.. ఎస్డీజీ లక్ష్యాల్లో పర్యావరణం, పరిశుభ్రత అంశాలపై కూడా దృష్టి పెట్టాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, వాయు కాలుష్యం నివారణ, రక్షిత తాగునీరు అంశాలపైకూడా దృష్టిపెట్టాలి. విద్యారంగం సహా వివిధ రంగాల్లో అమలు చేస్తున్న సంస్కరణలు వలన రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి.

► విద్యారంగంలో మనం చేపట్టిన సంస్కరణలు అన్నవి గొప్ప భవిష్యత్తు తరాలను అందిస్తాయి. ఇంగ్లిషుమీడియం సహా మనం తీసుకొచ్చిన అనేక సంస్కరణలు అమలుద్వారా పరిస్థితులను మార్చాలన్న మహాయజ్ఞాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఒక ప్రక్రియ ప్రారంభమైంది. దీన్ని అమలు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. వీటి ఫలితాలు అన్నవి..మంచి భవిష్యత్తు తరాలుగా సమాజానికి అందుతాయి. ఇంగ్లిషు మాధ్యమానికి వ్యతిరేకంగా కొన్ని పత్రికలు నిరంతరం కథనాలు రాస్తున్నాయి. వారి పిల్లలు మాత్రం ఇంగ్లిషుమీడియంలో చదుకోవాలి, పేదవాళ్ల పిల్లలు మాత్రం ఇంగ్లిషు మీడియంలో చదవకూడదన్న వారి వైఖరిని పదేపదే బయటపెడుతున్నారు. పేదవాళ్ల పిల్లలకు ఇంగ్లిషు మీడియంలో చదువులు అందకూడదన్నది వారి ధ్యేయంగా కనిపిస్తోంది. ఇవాళ ప్రభుత్వం చేపట్టిన యజ్ఞం కొనసాగుతుంది. స్కూళ్ల నిర్వహణలో ఉత్తమ విధానాలు పాటించడం ద్వారా నాణ్యమైన చదువులు ఉచితంగా అందుతాయి. దీనివల్ల చదువుల కోసం చేస్తున్న ఖర్చు భారం నుంచి ఆయా కుటుంబాలు ఉపశమనం పొందుతాయి. అంతిమంగా ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం నెరవేరుతుంది అని ఆయన పేర్కొన్నారు.

ఈ సమీక్షా సమావేశానికి సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

స్పందనను మరింత మెరుగు పర్చండి
ఇక వినతుల పరిష్కారంలో మరింత మెరుగైన వ్యవస్థ ‘స్పందన’కు మెరుగైన రూపంపై అధికారులతో సీఎం జగన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. వ్యక్తులకు సంబంధించిన సమస్యలతోపాటు, కమ్యూనిటీకి సంబంధించిన సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాం. ఒక నిర్ణీత సమయం పెట్టుకుని వాటిని శరవేగంగా పరిష్కరించి ప్రజలకు అండగా నిలిచాం. ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. స్పందనతోపాటు.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై కూడా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా దృష్టిపెట్టాం. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాటిని పరిష్కరించేందుకు నిధులు కూడా కేటాయించాం. ఇంకా ఏమైనా సమస్యలు మిగిలిపోయి ఉన్నాయా? అనేదానిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.  స్పందన కార్యక్రమాన్ని మెరుపరిచేలా ఆలోచన చేయాలి. 

సమస్యల పరిష్కారంలో అంకితభావానికి నిదర్శనంగా మనం నిలవాలి: ప్రజల సమస్యలను తీర్చాలన్నదే మన ఉద్దేశం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత నిజాయితీగా, అంకిత భావంతో, కృతనిశ్చయంతో మనం ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేశాం. మనం అంతా కలిసికట్టుగా గతంలో ఎన్నడూలేని రీతిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. సమస్యల పరిష్కారంకోసం ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల్లో వృత్తి నైపుణ్యం పెంచడం, నిర్మాణాత్మక రీతిలో వ్యవహరించడం అనే అంవాలపై దృష్టిసారించాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలనుకూడా పరిశీలించి అందులో ఎక్కడైనా స్వీకరించదగ్గవి ఉంటే… వాటిని కూడా స్వీకరించాలి.

► పథకాలు కావొచ్చు, రెవిన్యూ రికార్డులకు సంబంధించిన అంశాలు కావొచ్చు.. ఇలా ఏదైనా కావొచ్చు. కాని ఏ ఒక్కరూ కూడా అర్హులైన వారు మిగిలిపోకూడదు, అలాగే సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా మిగిలిపోవద్దు అన్నదే దీని ఉద్దేశం. ఈ విధానం ఎలా ఉండాలి? ఎలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపాలి? అన్నదానిపై ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలి. సీఎంఓ, ఇతర ఉన్నతాధికారులతో కూడిన అధికారయంత్రాంగ వ్యవస్థకు ప్రజలు చేర్చిన ఫిర్యాదులు, వినతులకు పరిష్కారాలు చూపడమే ఉద్దేశంగా ఈ ఆలోచన. స్పందన కార్యక్రమంకన్నా మరింత మెరుగ్గా, సమర్థవంతంగా దీన్ని నిర్వహించాలన్నది ఉద్దేశం. అధికారులంతా కూర్చొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఇప్పటివరకూ అమలవుతున్న స్పందన కార్యక్రమాన్ని మైక్రోస్థాయిలోకూడా పరిశీలనచేసి.. వాటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలి. వినతుల పరిష్కారంలో ప్రజల సంతృప్తికి పెద్దపీట వేయాలి అని అధికారులతో సీఎం జగన్‌ చెప్పారు.

చదవండి: సీఎం జగన్‌ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌.. ఆ నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో.. 

మరిన్ని వార్తలు