అంకితభావం, నిబద్ధతతో ముందుకెళదాం

1 Nov, 2020 03:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: నేడు (నవంబర్‌ 1) రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పొట్టి శ్రీరాములుతోపాటు ఇతర స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు ఎంతగానో ప్రేరేపింపజేస్తున్నాయి.మహానుభావుల త్యాగాలను మననం చేసుకుంటూ.. వారిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం మనమంతా అంకితభావం, నిబద్ధతతో ముందుకెళదాం’ అని సీఎం పేర్కొన్నారు.

ప్రజల ఆనందకర జీవనమే ప్రభుత్వానికి విజయసూచిక
ప్రజల ఆనందకర జీవనమే ఏ ప్రభుత్వానికైనా విజయసూచికని.. ఆ మేరకు పాలన సాగాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆకాంక్షించారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. ప్రజలే ప్రాధాన్యతగా అమలు చేస్తున్న విధానాలను ప్రభుత్వం కొనసాగించాలి.  సామాన్యుల కలలను సాకారం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని తన సందేశంలో గవర్నర్‌ పేర్కొన్నారు.   
 

మరిన్ని వార్తలు