బీసీలను బెదిరించాడు.. చంద్రబాబుకు ఖచ్ఛితంగా ఇవే చివరి ఎన్నికలు: సీఎం జగన్‌

7 Dec, 2022 19:19 IST|Sakshi

సాక్షి, కృష్ణా: టీడీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. కానీ, మన పాలనలో రాజ్యాధికారంలో బీసీలు భాగస్వామ్యం అయ్యారు. రాజ్యసాధికారికతకు బీసీలు నిదర్శనంగా నిలిచారు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత  చంద్రబాబుకు చెప్పండని సీఎం వైఎస్‌ జగన్‌.. విజయవాడ జయహో బీసీ మహాసభలో బీసీ శ్రేణులను ఉద్దేశించి పిలుపు ఇచ్చారు. 

ఖబడ్దార్‌ మీ అంతు చూస్తా అని బీసీలను చంద్రబాబు బెదిరించాడు. తోకలు కత్తిరిస్తానన్నాడు. కానీ, బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములనే విషయం చంద్రబాబుకు చెప్పండి. బీసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చంద్రబాబుకు గుర్తు చేయండి. చేసిన మోసాలను, నయవంచనను గుర్తు చేయండి. ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పండి అని సీఎం జగన్‌ ప్రసంగించారు.

మీ బిడ్డ జగన్‌ వయసు 49 ఏళ్లు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అవుతోంది. కానీ, 2024లో ఒంటరిగా పోటీ చేస్తానని చంద్రబాబు చెప్పలేకపోతున్నారు.  చేసిందేమీ లేక అబద్ధాలతో మోసం చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే చెప్పుకోవడానికి చంద్రబాబు బీసీల కోసం ఒక్క మంచి పని చేయలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడిపై పడుతున్నాడు. 

చరిత్రలో ఎవరూ వేయని విధంగా అడుగులు వేశాం. బీసీ కులాలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేశాం. సంక్షేమ పథకాల్లో పేద సామాజిక వర్గాలకే పెద్ద పీట వేశాం. ఆర్థిక సాధికారత కోసం రూ.3 లక్షల 19 వేల 228 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో 80 శాతం డబ్బు పేద సామాజిక వర్గాలకు ఖర్చు చేశాం. చంద్రబాబు హయాంలో అప్పుల్లో పెరుగుదల రేటు 19 శాతం. అప్పుడు ఆ రేటు కేవలం 15 శాతం మాత్రమే అని సీఎం జగన్‌ ప్రకటించారు. చంద్రబాబు హయాంలో పథకాలు ఎందుకు లేవో ప్రజలే ఆలోచించుకోవాలి. దోచుకో.. పంచుకో.. తినుకో ఇదే చంద్రబాబు విధానం అని సీఎం జగన్‌ ఎద్దేవా చేశారు. 

వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో ఆత్మ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమమే. గడప గడపకు నవరత్నాలు అందించడమే లక్ష్యం. ప్రతి గడపకు అందే సామాజిక న్యాయం, సాధికారతే నవరత్నాలు అని సీఎం జగన్‌ మరోసారి ప్రకటించారు. 

ఎస్సీల్లో ఎవరైనా పుడతారా? అని చంద్రబాబు హేళన చేశారు. కానీ, మన హయాంలో అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకున్నాం. ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధికారతకు కృషి చేశాం. ఎక్కడా అవినీతికి అవకాశం లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నాం అని సీఎం జగన్‌ చేశారు.

బాబుకు చివరి ఎన్నికలే!

2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలే. మనమంతా మారీచులు, పెత్తందారులతో యుద్ధం చేయక తప్పదు. చంద్రబాబు, ఆయన బ్యాక్‌బోన్‌ ఎల్లో బ్రదర్స్‌, దత్తపుత్రుడు ఏ సామాజిక వర్గానికి ప్రతినిధులో ఆలోచన చేయాలి. పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టులో కేసు వేస్తారు వీళ్లు. పేదల శత్రువు, ఆయన పెత్తందారులు. వాళ్లకు ఏనాడూ మంచి బుద్ధి లేదు.   వైఎస్‌ఆర్‌సీపీ సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. మానవతా వాదానికి వైఎస్‌ఆర్‌సీపీ ప్రతీక. నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతోంది. 2024లో ఇంతటికి మించిన గెలుపు ఖాయమని చెప్పండి అని బీసీ శ్రేణులను ఉద్దేశించి సీఎం జగన్‌ పిలుపు ఇచ్చారు. 

ప్రతి గడపకు వాస్తవ పరిస్థితిని తీసుకెళ్లాలి. మంచి జరిగితేనే జగనన్నకు తోడు ఉండండని చెప్పండి. చంద్రబాబు అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పండి అని జయహో బీసీ మహాసభకు హాజరైన సుమారు 85 వేలమంది బీసీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు