వెన్నుపోటు, దొంగ ఓట్లకు బాబు కేరాఫ్‌

24 Sep, 2022 07:48 IST|Sakshi

కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే ఆయన కుప్పానికి మంచి నీళ్లైనా ఇచ్చారా!

కుప్పం వేదికగా మూడో విడత వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌

కుప్పం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబు.. తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండడానికి కారణమైన కుప్పం నియోజకవర్గంలో ప్రజలు పంపులు తిప్పితే తాగడానికి నీరు వచ్చే పరిస్థితిని మాత్రం తీసుకు రాలేకపోయారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతులను.. ప్రధాన మంత్రులను కూడా తానే నియమించానని చెప్పుకునే ఆయన సొంత నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు.

చంద్రబాబు అనుభవం అంతా ప్రతి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించడానికి మాత్రం బాగా ఉపకరించిందని ఈ జిల్లాలో కథలు కథలుగా చెబుతారని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు, దొంగ ఓట్లకు 30 ఏళ్లుగా కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబే అని చెప్పారు. రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందించే వైఎస్సార్‌ చేయూత పథకం మూడో విడత నిధులను చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం ఆయన విడుదల చేశారు. కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్లు నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో తమ బతుకులు బాగు పడ్డాయని లబ్ధిదారులు స్వయంగా చెప్పే ఈ చేయూత పండుగ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఈ వేదికపై నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే..

కుప్పంపై కూడా బాబుకు వెన్నుపోటు ప్రేమే
సొంత మామ మీద చంద్రబాబు చూపించే వెన్నుపోటు ప్రేమే కుప్పం మీద కూడా చూపారు. ఇంతకాలం కుప్పం నుంచి తనకు కావాల్సింది పిండుకున్నాడు. ప్రజలకు ఏం చేయాలన్న దానిపై మాత్రం ఆలోచించ లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా కుప్పంలో కరువుకు పరిష్కారం చూపలేకపోయారు. 

కుప్పంలో కరువు, నీటి సమస్య నివారణకు హంద్రీ–నీవా జలాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం అని తెలిసినా.. అది చేస్తే ప్రజలు తన మాట వినరని భయపడిపోయారు. అందుకే ఆ హంద్రీ–నీవా పనులకు ఆయనే అవరోధంగా మారారు. ఎన్నికలు వచ్చేసరికి తన పార్టీకి చెందిన వారికి మాత్రం కాంట్రాక్టు ఇచ్చి వందల కొద్దీ ట్రాక్టర్లతో నియోజకవర్గంలో తాగునీరు సరఫరా చేశానని చెప్పుకొని, దొంగ అకౌంట్లతో దోచేశారు. 

కుప్పంతో మొదలు ప్రతి చోటా బీసీలకు అన్యాయమే..
కుప్పం నియోజకవర్గంలో అత్యధికులు బీసీలే ఉన్నారు. ఈ నియోజకవర్గం ఓసీలు పోటీ చేయాల్సిన సీటు కాకపోయినా.. బీసీలకు ఇవ్వకుండా అన్యాయం చేస్తూ తనే లాక్కొన్నారు. బీసీలకు న్యాయం చేశానని రెండు రోజుల క్రితం చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగ్‌లు చెప్పాడు.
1983 నుంచి 2019 వరకూ ఈ 36 సంవత్సరాల్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా కుప్పం అసెంబ్లీ టికెట్‌ను బీసీలకు ఇవ్వలేదు. ఇది బాబు మార్కు సామాజిక న్యాయం. కుప్పంతో మొదలు పెడితే బీసీలకు ప్రతిచోటా అన్యాయం చేశారు. బీసీలను వాడుకుని, విడిచి పెడుతున్నది ఎవరో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. 

బాబు చేయలేనిది మేం చేస్తున్నాం 
కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడో చెప్పడానికి ఏమీ లేదు. ఏం చేయలేదో చెప్పడానికి చాలా ఉన్నాయి. ఆరు నెలల్లో హంద్రీ–నీవా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తి చేస్తున్నాం. కుప్పంను మున్సిపాలిటీ చేయడంతో పాటు.. దాని అభివృద్ధి కోసం రూ.66 కోట్లు ఇచ్చింది మీ బిడ్డ జగనే. 
55 ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆర్డీఓ కార్యాలయాన్ని ఈ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. రూ.6.5 కోట్లతో రెడ్డిపల్లి– రామకుప్పం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఇచ్చాం. కొత్తపేట నుంచి డీకే పల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి పూర్తి చేశాం.  రూ.10 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ పూర్తి చేశాం. ఒకేషనల్‌ జూనియర్‌ కాలేజీ పనులు పూర్తి చేసిందీ.. రాళ్లమడుగూరు జూనియర్‌ కాలేజీ పనులు పూర్తి చేసిందీ.. కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయానికి రూ.20 కోట్లు కేటాయించింది కూడా ఈ ప్రభుత్వమే.

నవరత్నాల పథకాలన్నీ కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా.. కుప్పంలో అంతా నావాళ్లే అని అమలు చేశాం. రాష్ట్రమంతటితో పాటు కుప్పం నియోజకవర్గానికి వివిధ డీబీటీ పథకాల ద్వారా రూ.866 కోట్లు.. నాన్‌ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.283 కోట్లు.. మొత్తంగా ఈ నియోజకవర్గ ప్రజలకు  రూ.1,149 కోట్లు పంపిణీ చేసింది మీ బిడ్డ జగనే. 

ఎమ్మెల్సీగా ఉంటూనే తన ద్వారా కుప్పానికి నాతో అన్నీ చేయిస్తున్న భరత్‌ను ఈసారి ఎన్నికల్లో గెలిపించండి. మంత్రిగా మీ ముందుకు పంపిస్తాను.  

ఈ ప్రభుత్వానికీ, ఆ ప్రభుత్వానికి తేడా గమనించండి 
సమాజాన్ని చంద్రబాబు చూస్తున్న విధానానికీ, మీ ఈ ముఖ్యమంత్రి చూస్తున్న విధానానికీ మధ్య తేడాను ప్రజలు గమనించాలి. అభివృద్ధి అన్నది ప్రతి ఇంట్లో పిల్లల చదువులో, రైతుల్లో, ఆరోగ్య రంగంలో, అక్కచెల్లెమ్మల సాధికారతలో, అవ్వాతాతల సంక్షేమంలో కనిపించాలి. సామాజిక వర్గాల ఆర్తిని ఈ ప్రభుత్వం అర్థం చేసుకుని అడుగులు వేస్తోంది. బీసీలంటే బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని గుర్తించిన ప్రభుత్వం ఇది. 

నవరత్నాలు అమలు, డీబీటీ, పదవులు, కాంట్రాక్టులు.. ఇలా ఏది తీసుకున్నా పారదర్శకత కనిపిస్తుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఏకంగా చట్టాలు చేసి మేలు చేశాం. కానీ, చంద్రబాబు మాత్రం తనకు కావాల్సిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడిని చూసుకుంటే చాలనుకున్నారు. ఎవరూ చూపరు, రాయరు.. ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోరని భావించారు. 

చంద్రబాబు చేస్తున్న మోసానికి, అన్యాయానికి ఇక తల వంచేది లేదని కుప్పం ప్రజలు నిర్ణయించుకొని అభివృద్ధికి మద్దతిస్తే ఎలా ఉంటుందో మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో చూపించారు. అన్నింటా కూడా వైఎస్సార్‌సీపీనే క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే, కుప్పం ప్రజలు దోచుకో.. పంచుకో.. తినుకో.. డీపీటీకి వ్యతిరేకంగా ఓటు వేశారు.  

చేతకానితనమా.. చేయకూడదనే దుర్బుద్ధా..
చంద్రబాబు మాత్రం కుప్పం మున్సిపాలిటీలో కనీసం డబుల్‌ రోడ్డు కూడా వేయలేకపోయారు. కృష్ణగిరి నుంచి పలమనేరు హైవేకు లింక్‌ ఇస్తానన్నాడు. అది చేయలేదు. ఎన్నిసార్లు సీఎం అయినా కుప్పంలో రోడ్డు వేసే మనసు లేదు. అయితే ఎన్నికలప్పుడు మాత్రం ఏకంగా కుప్పంలో ఎయిర్‌పోర్టు కడతానని ప్రజల చెవిలో పువ్వు పెట్టాడు.

జాబు కావాలంటే.. బాబు రావాలని ఈయనే అంటాడు. ఈ నియోజకవర్గం నుంచి నిత్యం 5 వేల మంది ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లొస్తుంటారు. వీరికి సొంత నియోజకవర్గంలో ఉద్యోగాలు, ఉపాధి చూపించాలన్న ఆలోచన ఈయనకు రాదు. చంద్రబాబు ఏ రోజూ ఈ నియోజకవర్గంలో ఉండరు. ఇక్కడకు రారు. పట్టించుకోరు.

14 ఏళ్లు సీఎంగా ఉండేందుకు తనకు కుప్పం సహకరించినా, చివరకు రెవెన్యూ డివిజన్‌ కూడా ఏర్పాటు చేయలేకపోయారు. చివరకు రెవెన్యూ డివిజన్‌ కోసం జగన్‌కు లేఖ రాస్తాడు. మీ కోసం కుప్పంను రెవిన్యూ డివిజన్‌ చేశాం. చంద్రబాబు కంటే చేతకాని నాయకుడు ఎక్కడైనా ఉంటాడా? చేయకూడదనే నాయకుడు ఎక్కడైనా ఉంటాడా? దీన్ని చేతకానితనం అనాలా? లేక చేయకూడదనే దుర్బుద్ధి అనాలా? కుప్పంలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీ లేదు.. మెడికల్‌ కాలేజీ లేదు. 

పుట్టింటోళ్లు కూడా ఇలా ఆదుకోలేదు
మూడేళ్ల క్రితం వరకు మా కుటుంబంలో నేను కూలీ పనులే చేసుకునేదాన్ని. చేయూత పథకంలో నాకు మొదటి విడతలో రూ.18,750 ఇచ్చారు. దానికి బ్యాంకు లోన్‌ కలిపి ఒక ఆవును కొనుక్కున్నాను. రెండో విడత వచ్చిన డబ్బులతో గడ్డి కటింగ్‌ మెషిన్‌ తీసుకొన్నాను. మా మహిళా సంఘం గ్రూప్‌ సీ గ్రేడ్‌ నుంచి ఏ గ్రేడ్‌కు వచ్చింది. బ్యాంకు వారు మాకు రూ.20 లక్షలు ఇస్తే నాకు రూ.2 లక్షలు వచ్చాయి. దాంతో మరో నాలుగు ఆవులు కొనుక్కున్నా. స్త్రీనిధి డబ్బులు కూడా వచ్చాయి. మా పాపకు విద్యా దీవెన డబ్బులు వచ్చాయి. తను బీఎస్‌సీ (హార్టికల్చర్‌) చదువుతోంది. ఇవాళ నేను మొత్తం 10 ఆవులతో రోజుకు 110, 120 లీటర్ల పాలు పోస్తున్నాను. ఖర్చులు పోను నెలకు రూ.60 వేలు మిగులుతున్నాయి. ఈ ఘనత మా జగన్‌మోహన్‌రెడ్డిదే. నా పుట్టింటి వాళ్లు కూడా ఇలా సాయం చేయలేదు. మళ్లీ మళ్లీ జగన్‌నే సీఎంగా గెలిపించుకుందాం.
– సుబ్బమ్మ, గుడిపల్లె మండలం, మహాలక్ష్మి గ్రూపు సభ్యురాలు

ఈసారి కూడా జగనే సీఎం..
గతంలో మేం కూలికి వెళ్లే వాళ్లం. మాకు మొదటి విడత చేయూత పథకం కింద ఇచ్చిన డబ్బుతో ఆవును కొనుక్కున్నా. రెండో విడతలో వచ్చిన డబ్బుతో మరో ఆవును కొనుక్కుని నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి అన్న ఉన్నారన్న ధైర్యం మాకు ఉంది. నేను, మా ఆయన.. ఇద్దరం ప్రతి రోజూ మిమ్మల్ని తలుచుకుంటాం. వాళ్ల మేనమామ (సీఎం) వల్ల పిల్లలు కూడా పెద్ద చదువులు చదువుతున్నారు. ఇప్పుడు మూడో విడత వచ్చే డబ్బులతో మరో ఆవును కొనుక్కుంటాను. మీ వల్ల పాలకు కూడా మంచి ధర వస్తోంది. మా మహిళలతో పాటు ప్రతి ఒక్కరూ మీతోనే ఉంటారు. మళ్లీ కూడా మీరే సీఎం.  
 – మరియమ్మ, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా

ప్రజల కష్టాలన్నీ తీరేలా మంచి పాలన 
జగన్‌మోహన్‌రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ఇప్పుడు నేను ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం కే.కోటపాడులో వైఎస్సార్‌ చేయూత పథకం ప్రకటించారు. ఆయన  ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే సంతృప్త స్థాయిలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా అందరికీ పథకాలు వర్తింప చేస్తూ అండగా నిలుస్తున్నారు. బటన్‌ నొక్కి లక్షలాది మంది మహిళలకు వారి అకౌంట్లలోకి నగదు జమ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలన్నీ తీరేలా మంచి పరిపాలన అందిస్తున్న సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.   
 – బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం

టీడీపీ వాళ్లకూ లబ్ధి కలిగించాం
చంద్రబాబూ.. నువ్వు పులివెందులకు వెళ్లొచ్చు కానీ, సీఎం కుప్పం రాకూడదా? మీ మామ దయాదాక్షిణ్యాలతో ఇక్కడ రంగస్వామినాయుడనే పెద్ద మనిషి ఎమ్మెల్యేగా ఉంటే ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించి, సులువుగా గెలవచ్చని ఇక్కడ పాతుకుపోయావు. ఇక్కడి బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు అన్యాయం చేశావు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కులం, మతం, పార్టీలు, రాజకీయాలు చూడకుండా టీడీపీ నాయకులకు సైతం సంక్షేమ పథకాలు వర్తింప చేసింది. అందుకే ఈ రోజు కుప్పం ప్రజలు సీఎం జగన్‌కు మంగళ హారతులతో స్వాగతం పలికారు. తప్పనిసరిగా కుప్పంలో విజయం సాధిస్తాం. ఇన్నేళ్లలో చంద్రబాబు ఏం చేశాడని మీరంతా ఆలోచించాలి.  
    – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూగర్భ వనరుల శాఖా మంత్రి

బాబు ఎప్పుడూ అందుబాటులో లేరు
33 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉంటూ.. అందులోనూ 14 ఏళ్లు సీఎంగా పని చేసినప్పటికీ.. ఇక్కడి వారికి ఎప్పుడూ అందుబాటులో లేరు. ఎమ్మెల్యేగా ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదు. పైగా సీఎం జగన్‌ కుప్పంకు ఏం చేశారని అడుగుతున్నారు. మీతోనే (చంద్రబాబు) ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని ప్రకటన చేయించారు. ఇది చాలదా.. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం ఎంతగా కృషి చేస్తున్నారో చెప్పడానికి.    
– భరత్, ఎమ్మెల్సీ

ఎంఐజీ లేఅవుట్లలో.. 60% ధరకే విక్రయ ఒప్పందం 
సాక్షి, అమరావతి :  పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఎంఐజీ లే అవుట్లు, జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో భూమి ధరలను రెండు భాగాలుగా విభజించుకోవడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక నుంచి పట్టణాభివృద్ధి సంస్థలు భూమి ధరను మొత్తం విక్రయ ధరలో 60 శాతం, అభివృద్ధి రుసుములు కింద మొత్తం విక్రయ ధరలో 40 శాతంగా విభజించుకోవడానికి అనుమతిస్తూ రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయించిన ధర ఆధారంగా ఈ విభజన ఉండాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. గతంలో పూర్తి విక్రయ ధర చెల్లిస్తే గానీ కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదని.. కానీ, ఇప్పుడు మొత్తం విక్రయ ధరలో 60 శాతం చెల్లించడం ద్వారా ఒప్పందం చేసుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంవల్ల రిజి్రస్టేషన్‌ శాఖకు ఎటువంటి నష్టం ఉండదని..  సేల్‌డీడ్‌ ఇచ్చేటప్పుడు మొత్తం విక్రయ ధర అంటే భూమి ధర 60 శాతం, అభివృద్ధి రుసుము 40 శాతం చెల్లించిన తర్వాతే జరుగుతుందని ఆ ఉత్తర్వుల్లో వై. శ్రీలక్ష్మి స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు