సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో 1,36,694 కోట్లు ప్రజల చేతుల్లో పెట్టామని, ఎక్కడా లంచాలకు తావులేకుండా లబ్ధిదారులకు మేలు జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదని ఇంత మంది జరుగుతున్నా కూడా చంద్రబాబు పాలనే కావాలని దుష్టచతుష్టయం అంటోందని మండిపడ్డారు. ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. దుష్టచతుష్టయం అంటే చంద్రబాబు, ఏబీఎన్, రామోజీరావు, టీవీ5 అని అన్నారు.
ఉచితంలో ఆర్థిక విధ్వంసం అని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఏపీని మరో శ్రీలంకగా మారుస్తున్నారని అంటున్నారని, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబులా పక్కన పడేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందట అని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ పథకాలను ఆపేయాలని టీడీపీ నేతలు అంటున్నారని, పేదలకు మంచి చేయొద్దని అంటున్నారని సీఎం మండిపడ్డారు.
ఇలాంటి రాక్షసులతో, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. దుష్టచతుష్టయం కడుపు మంటతో ఉందని, మహిళల్ని గత ప్రభుత్వం నట్టేట ముంచిందని తెలిపారు. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిందని, మహిళలకు రూ. 3,036కోట్లు ఇస్తామని ఎగనామం పెట్టిందని సీఎం అన్నారు. మనది మహిళా పక్షపాతి ప్రభుత్వమని, టీడీపీ హయాంలో 44 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారని, మన హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
చదవండి: YSR Sunna Vaddi 2022: ఒంగోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన