రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలి: సీఎం జగన్‌

15 Aug, 2021 12:21 IST|Sakshi

హక్కులు అందరికీ సమానంగా అందాలి

పారదర్శక పాలన అందిస్తున్నాం

26 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, విజయవాడ: కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం ఇదని.. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం.. జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్‌ అధికారులకు సేవా పతకాలను సీఎం అందజేశారు. ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. హక్కులు అందరికీ సమానంగా అందాలన్నారు. పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా చూస్తున్నామని, 26 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇక్కడ చదవండి: జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌

వ్యవసాయ రంగంపై రూ.83 వేల కోట్లు..
వ్యవసాయ రంగంపై రూ.83 వేల కోట్ల వ్యయం చేశామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామన్నారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటివరకు రూ.17వేల కోట్లు ఇచ్చామని, 31 లక్షల మంది రైతులకు వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా అందించామని సీఎం పేర్కొన్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతో పాటు, ధాన్యం కొనుగోలు సేకరణ కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

ప్రతినెలా ఒకటో తేదీనే గడప వద్దకే పింఛన్‌
‘‘గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షా 30 వేల శాశ్వత ఉద్యోగాలిచ్చాం. ప్రతినెలా ఒకటో తేదీనే గడప వద్దకే పింఛన్‌ అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ఆర్‌బీకేల ద్వారా సేవలు అందిస్తున్నాం. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1039 కోట్లు చెల్లించాం. ఏపీ అమూల్‌ పాలవెల్లువతో పాడి రైతులకు అండగా నిలిచామని’’ సీఎం అన్నారు.

కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులు..
"నాడు-నేడు" ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చాం. కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను మారుస్తున్నాం. జగనన్న గోరుముద్ద ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. మా ప్రభుత్వం.. మహిళా పక్షపాత ప్రభుత్వం. అక్కాచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని’’ సీఎం అన్నారు.

అమ్మఒడి ద్వారా రెండేళ్లలో రూ.13వేల కోట్లు..
‘‘అమ్మఒడి ద్వారా రెండేళ్లలో రూ.13వేల కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ.9వేల కోట్లు ఇచ్చాం. డ్వాక్రా మహిళలకు ఇప్పటివరకు రూ.6,500 కోట్లు అందించాం. మహిళల భద్రతకు దిశా చట్టం, దిశా పోలీస్‌స్టేషన్లు, దిశా యాప్‌లు తీసుకొచ్చాం. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. 5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారిని ఆరోగ్యశ్రీకిందకు తీసుకొచ్చాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నాం. గ్రామాల్లో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల నిర్మాణం జరుగుతోంది. కరోనాను ఆరోగ్యశ్రీలోకి తెచ్చి ఉచితంగా చికిత్స అందించాం. కొత్తగా 16 వైద్య బోధనా ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. అర్హత ఉన్న 61 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు