ప్రకృతి వ్యవసాయమే మేలు.. రైతులకు అండగా ఉంటాం: సీఎం జగన్‌

7 Jul, 2022 15:25 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: ప్రకృతి వ్యవసాయమే ఈరోజుల్లో శ్రేయస్కరమని.. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అన్ని విధాల రైతులకు ప్రోత్సాహం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో భాగంగా.. గురువారం మధ్యాహ్నాం పులివెందులలో ఏపీకార్ల్‌ వద్ద న్యూటెక్‌ బయోసైన్సెస్‌కు శంకుస్థాపన చేసి ఆయన ప్రసంగించారు.

‘రసాయనాలతో కూడిన ఆహారం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలను తగ్గించాలి. ప్రకృతి వ్యవసాయమే ఈ రోజుల్లో అన్నివిధాలా శ్రేయస్కరం. ఏపీలో ఆరు లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాలపై మరింత దృష్టిసారించాలి.  గ్రామస్థాయి నుంచి శిక్షణ అవసరం. ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచాలి. ఆర్బీకేల ద్వారా అవసరమైన శిక్షణ అందిస్తున్నాం.

ప్రకృతి వ్యవసాయంపై అంతర్జాతీయ సంస్థలతో మన ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తరపున పలు చర్యలు  చేపడుతున్నాం. విత్తు నుంచి విక్రయం వరకూ ఆర్బీకేలు అండగా నిలుస్తున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు పథకాలు అమలు చేస్తున్నాం’’ అని సీఎం జగన్‌ తెలియజేశారు.

మరిన్ని వార్తలు