ఏలూరు బాధితులకు సీఎం జగన్‌ బాసట

9 Dec, 2020 05:06 IST|Sakshi

ఆరోగ్యశ్రీలో మూడు రకాల చికిత్సలు

మూర్ఛ వ్యాధి చికిత్స ప్యాకేజీ రూ.15,688కు పెంపు

చికిత్స ఐదు రోజులు దాటితే బాధితుడికి రోజుకు రూ.900  

ఏలూరులో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వెల్లడి

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరులో వింత వ్యాధికి గురై అస్వస్థతతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాసటగా నిలిచారు. మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఏలూరులో బాధితులను స్వయంగా పరామర్శించిన ఆయన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. మూర్ఛ వ్యాధితో బాధపడే రోగులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యశ్రీలో 3 రకాల చికిత్సలకు ప్యాకేజీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మంగళవారం మీడియాకు తెలిపారు.

► ఇంతకు ముందు సాధారణ మూర్ఛ వ్యాధిగ్రస్తుడు మూడు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందితే ప్రభుత్వం సహాయం అందించేది. ప్రస్తుతం ఐదు రోజులపాటు వైద్యం పొందినప్పటికీ ఆ సాయం వర్తింపజేస్తారు.
► మూర్ఛ వ్యాధిగ్రస్తులకు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ రూ.10,000 నుంచి రూ.15,688 వరకు పెంచారు. 8 రకాల రక్త పరీక్షలను కూడా ఈ ప్యాకేజీలో కలిపారు. చిన్న పిల్లలకు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ రూ.10,262 నుంచి రూ.12,732కు పెంచారు. 6 రకాల రక్త పరీక్షలను అందులో చేర్చారు.
► ఐదు రోజులకు మించి అదనంగా చికిత్స పొందే మూర్ఛ వ్యాధిగ్రస్తులకు రోజుకు రూ.900, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి రూ.2,000 ప్యాకేజీని కొత్తగా చేర్చారు. నూతన విధానం మేరకు రక్త పరీక్షలకు 23.73 శాతం రేటు పెంచడం వల్ల అన్ని నెట్‌వర్క్‌ (ప్రభుత్వ, ప్రైవేట్‌) ఆస్పత్రులకు ప్రయోజనం చేకూరుతుంది.   

>
మరిన్ని వార్తలు