వరదబాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

29 Nov, 2021 14:36 IST|Sakshi

అమరావతి: వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరద బాధిత ప్రాంతాలైన కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్షలో.. పాక్షికంగా దెబ్బతిన్న, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం, 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన కాల్స్, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, రూ.2వేల రూపాయల అదనపు సహాయం పంపిణీ, నిత్యావసరాల పంపిణీ, అధికారుల క్షేత్రస్థాయి పర్యటన, రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణ, చెరువుల భద్రత, గండ్లు పూడ్చివేత, తాగునీటి సరఫరా, గల్లంతైన వారికి నష్టపరిహారం, మరణించిన పశువులకు పరిహారం సహా పలు అంశాలను సీఎం జగన్‌ సమీక్షించారు. 

అంశాలవారీగా ప్రగతిని అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్‌. సమావేశంలో కలెక్టర్లు వరద సహాయక చర్యల వివరాల సీఎం జగన్‌కు అందించారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపైనా కూడా సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..
పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ పూర్తయిన... వెంటనే సోషల్‌ఆడిట్‌ కూడా నిర్వహించాలి.
పూర్తిగా ధ్వసంమైన ఇళ్ల స్థానే కొత్త ఇళ్లను మంజూరు చేసి.. వెంటనే పనులుకూడా మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలి.
ఇళ్లులేని కారణంగా వారికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలి. వాటిలో కనీస సదుపాయాలను ఏర్పాటు చేయాలి.
మళ్లీ నివాస వసతి ఏర్పడేంతవరకూ కూడా వారిని జాగ్రత్తగా తీసుకోవాలి.
చెరవులు గండ్లు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. చెరువుకు, చెరువుకు మధ్య అనుసంధానం ఉండాలి.
చెరువులు నిండగానే అదనంగా వచ్చే నీటిని నేరుగా కాల్వలకు పంపించే వ్యవస్థ ఉండాలి, భవిష్యత్తులో దీనిపై దృష్టిపెట్టండి.
తాగునీటి వసతుల పునరుద్ధరణపై దృష్టిపెట్టండి.
అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో నీటిని నిల్వచేయలేని పరిస్థితి. అలాగే చాలాచోట్ల తాగునీటి సరఫరాకు ఆధారమైన చెరువులుకూడా గండ్లు పడ్డాయి.
వీటిమీద ఆధారపడ్డ పట్టణాల్లో, గ్రామాల్లో తాగునీటికి కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
వచ్చే వేసవిని కూడా దృష్టిలో ఉంచుకుని బలమైన ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలి.
నిత్యావసరాలు అందించిన ప్రతి కుటుంబానికి కూడా అదనపు సహాయం రూ.2వేలు అందాలి.
అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు వచ్చే విజ్ఞప్తులపై ఉదారంగా స్పందించండి.
ఆర్బీకేల ద్వారా విత్తనాలను పంపిణీకి అన్ని ఏర్పాట్లూ చేశాం. ఆర్బీకేల్లో విత్తనాలు ఉంచాం.

ఆ పెద్ద మునిషివి బురద రాజకీయాలు: సీఎం
వరద బాధిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు ఇంతటి శరవేంగా చర్యలను తీసుకోవడం అన్నది గతంలో ఎన్నడూ జరగలేదు. గతంలో కనీసం నెల పట్టేది.
ఇప్పుడు వారంరోజుల్లోనే బాధితులకు సహాయాన్ని అందించగలిగారు.
బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా నష్టపరిహారాన్ని అందించాం.
గతంలో ఇల్లు ధ్వంసమైతే పరిహారం అందడానికి నెలరోజులు పట్టేది.
దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే నెలరోజులు పట్టేది.
గల్లైంతైన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చేవారు కాదు.
అలాంటిది ఇవాళ వారంరోజుల్లో ఆయా కుటుంబాలకు పరిహారం ఇచ్చి వారిని అదుకున్నారు.
గతంలో రేషన్, నిత్యావసరాలు ఇస్తే చాలు అనుకునేవాళ్లు.
మనం వీటిని ఇవ్వడమే కాకుండా రూ.2వేల రూపాయలు అదనపు సహాయం కూడా ఇచ్చాం.
గతంలో ఎప్పుడూ కూడా ఇలా చేయలేదు.
సీజన్‌ ముగిసేలోగా నష్టపోయిన రైతులకు సహాయం చేసిన దాఖలాలు లేవు.
ఇప్పుడు నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ పూర్తిచేసి.. సీజన్‌లోగా వారికి సహాయం అందిస్తున్నాం.
గతంలో ఇన్‌పుట్‌సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం పట్టేది. ఆతర్వాత కూడా ఇచ్చిన దాఖలాలు లేవు.
ఇవాళ పంట నష్టపోయిన సీజన్‌ ముగిసేలోగానే మనం అందిస్తున్నాం.
రూ.6వేల కోట్లు నష్టం జరిగితే ... ఇచ్చింది రూ.34 కోట్లే అని విమర్శలు చేస్తున్నారు.
జరిగిన నష్టంలో 40శాతం రోడ్లు రూపేణా,  30శాతానికిపైగా పంటరూపేణా, సుమారు 18శాతం ప్రాజెక్టులకు జరిగిన నష్టం రూపేణా జరిగింది.
హుద్‌హుద్‌లో రూ.22వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు.. ఇచ్చింది రూ.550 కోట్లు.
అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది.
రూ.22వేల కోట్లు నష్టం వచ్చిందని చెప్పిన పెద్ద మనిషి ఇచ్చింది రూ.550 కోట్లు.
కలెక్టర్లు, అధికారులు బాగా పనిచేసి పరిహారాన్ని ఇంతవేగంగా అందిస్తే.. దానిపైన కూడా బురద జల్లుతున్నారు.  

చదవండి: 

సీఎం జగన్‌ను కలిసిన కేంద్ర బృందం, పనితీరుపై ప్రశంసలు

ఆ దిశగా మరో ముందడుగు.. సీఎం జగన్‌ ట్వీట్‌

మరిన్ని వార్తలు