ఏలూరు: పురుగు మందుల అవశేషాలే కారణం

16 Dec, 2020 16:40 IST|Sakshi

ఏలూరు ఘటనపై సీఎం​ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, అమరావతి/ పశ్చిమ గోదావారి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఏలూరు ఘటనపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కలెక్టరేట్‌ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు, జాయింట్‌ కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సునంద, డీసీహెచ్‌మో డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అస్వస్థతకు కారణాలపై శాస్త్రవేత్తలతో చర్చించారు ముఖ్యమంత్రి. పురుగు మందుల అవశేషాలే ఏలూరు పరిస్థితికి కారణమని ఎయిమ్స్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థలు అభిప్రాయపడ్డాయి. అవి ఎలా మనుషుల శరీరాల్లోకి ప్రవేశించాయన్నదానిపై దీర్ఘకాలంలో మరింత అధ్యయనం అవసరమని నిపుణులు తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యయన బాధ్యతల్ని న్యూఢిల్లీ, ఎయిమ్స్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీకి అప్పగించారు. (ఏలూరులో కేసులు తగ్గాయ్)

అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.

మరింత లోతుగా పరీక్షలు:

  • దేన్నీ కొట్టి పారయేకుండా వీలైనంత మేర పరీక్షలు చేయించాలి. అప్పుడే ఏలూరు లాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూడగలం.
  •  డంపింగ్‌ యార్డులు నిర్వహణపైనా దృష్టి పెట్టండి. ఏలూరుతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా అంతటా కూడా అలాంటి పరీక్షలు చేయించాలి.
  • అలాగే తాగు నీటి వనరులన్నింటినీ అన్ని జిల్లాల్లో పరిశీలన చేయండి. ఒక పద్దతి ప్రకారం శాంపిల్స్‌ తీసుకుని, వాటిని నిపుణులచేత విశ్లేషణ చేయించాలి.
  • వాటన్నింటినీ లోతుగా అధ్యయనం చేయడం ద్వారా, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.
  • ఎయిమ్స్, ఐఐసీటీ కార్యాచరణలోకి దిగి ఏలూరు ఘటనలకు దారి తీసిన పరిస్థితులపై నిరంతర పరిశీలన చేయాలి.
  • దానికి కార్యాచరణ తయారు చేయాలని చీఫ్‌ సెక్రటరీకి ఆదేశం.ఇంకా అందు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, మార్గాలను ఖరారు చేయాలని నిర్దేశం.
  • భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలి. (ఏలూరు ఘటనలో అంతుచిక్కని కారణం)

సేంద్రీయ వ్యవసాయం:

  • సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి .రైతులకు దీనిపై అవగాహన కల్పించాలి:
  • అందు కోసం ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేయాలి.
  • ఆరోగ్యానికి హాని కలిగించే పురుగు మందులను పూర్తిగా మార్కెట్‌ నుంచి తొలగించాలి. దీనిపై వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

ప్రజారోగ్య ల్యాబ్‌లు:

  • ప్రతి జిల్లాలో పబ్లిక్‌ హెల్త్‌ (ప్రజారోగ్య) ల్యాబ్‌లు పటిష్టం చేయాలి.
  • క్రమం తప్పకుండా శాంపిళ్లను స్వీకరించి పరీక్షలు చేసి, ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలి.
  • అలాగే మూడు ప్రాంతాల్లో మూడు రాష్ట్ర స్థాయి ల్యాబ్‌లఏర్పాటుకు ఆలోచన చేయాలి.

ఢిల్లీ ఎయిమ్స్‌:

  • అస్వస్థతకు గురైన వారి రక్తంలో లెడ్‌ కనిపించింది. అలాగే పాలకు సంబంధించి అన్ని శాంపిల్స్‌లో నికెల్‌ కనిపించింది.
  • పేషెంట్లను పరిశీలిస్తే ఆర్గానో క్లోరిన్‌ కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తున్నాం.
  • బహుశా పెస్టిసైడ్స్‌ (పురుగు మందులు) కారణంగానే ఇది వచ్చి ఉండొచ్చు. ఆహార సైకిల్‌లో భాగంగా అది శరీరంలో చేరే అవకాశం ఉంది.
  • అస్వస్థతకు గురైన వారితో పాటు, వారి బంధువుల రక్త నమూనాల్లో కూడా లెడ్‌ కనిపించింది.
  • దీర్ఘకాలంలో దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
  •  వివిధ సంస్థలు చేసిన పరీక్షల ఫలితాలు, అస్వస్థతకు గురైన వారి కేసు షీట్లను పోల్చి చూస్తే ఆర్గనో క్లోరిన్‌ కారణం కావొచ్చని భావిస్తున్నాం.
  •  కొన్ని నెలల పాటు ఆహార పదార్థాలు, తాగు నీరు, కూరగాయలు తదితర శాంపిళ్లను పరిశీలిస్తే అస్వస్థతకు దారి తీసిన వైనంపై కచ్చితమైన కారణం కనుక్కునే అవకాశం ఉంది.
  • శాంపిళ్లకు జియో ట్యాగింగ్‌ కూడా చేయాలి.

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌

  • తమ పరీక్షలకు సంబంధించి ప్రజంటేషన్‌ ఇచ్చిన ఐఐసీటీ:
  • ఏలూరులో 21 చోట్ల నుంచి నీటి శాంపిల్స్‌ తీసుకున్నాం.
  •  అలాగే మనుషులు, పశువుల నుంచి కూడా రక్తపు నమూనాలు సేకరించాం.
  • తాగునీటిలో ఎలాంటి గుర్తించదగ్గ భారీ లోహాలు కనిపించ లేదు. లెడ్‌ కాని, ఆర్సెనిక్‌ కాని, నికెల్‌ తరహా లోహాలు కాని లేవు
  • అలాగే పురుగుమందుల అవశేషాలు కూడా గుర్తించదగ్గ స్థాయిలో లేవు.
  • ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేసి నిర్ధారించుకున్నాం. వాటర్‌ క్లీన్‌గా ఉంది.
  • రక్తపు నమూనాల్లో ఎండో సల్ఫాన్, డీడీడీ కనిపించాయి.
  • కొన్ని రక్తపు నమూనాల్లో లెడ్‌ కనిపించింది. ఆర్గనో ఫాస్పేట్స్‌ కనిపించలేదు

నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌ఈఈఆర్‌ఐ) హైదరాబాద్‌
ఏలూరులో  గాలిలో కాలుష్యకారక పదార్థాలపై పరిశీలన:

  • గాలి కూడా సాధారణ స్థాయిలోనే ఉందని వెల్లడి. భూగర్భ జలాల శాంపిళ్లపై పరిశీలన.
  • మెర్క్యురీ తప్ప మిగిలిన లోహాలన్నీ పరిమితి స్థాయిలోనే ఉన్నాయని వెల్లడి
  • ఉపరితల జలాల్లో కూడా అన్ని పరిమిత స్థాయిలోనే ఉన్నాయని, మెర్క్యురీ మాత్రం సాధారణ పరిమితికి మించి ఉందని వెల్లడి
  • ఆర్గనో క్లోరిన్‌ కాని, ఆర్గనో ఫాస్పేట్స్‌కాని కనిపించలేదని వెల్లడి. లెడ్‌ కూడా లేదని వెల్లడి
  • మట్టి నమూనాలపై విశ్లేషణ, పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడి
  • ఉపరితల జలంతో పోలిస్తూ భూగర్భజలాల్లో మెర్క్యురీ ఎక్కువ స్థాయిలో ఉందని వెల్లడి
  •  సాలిడ్‌ వేస్ట్‌ బర్నింగ్‌ (వ్యర్థ పదార్ధాలు కాల్చడం) వల్ల కూడా ఇది జరిగే అవకాశాలు ఉంటాయి.

సీసీఎంబీ, హైదరాబాద్‌

  • మేం పరిశీలించిన శాంపిళ్లలో పరిమితి మించి ఏవీ కనిపించ లేదు
  • వైరస్‌ కాని, బాక్టీరియా కాని కనిపించ లేదు.

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, పుణె

  • సీరెం, యూరిన్‌ తదితర శాంపిళ్లు తీసుకుని పరిశీలన చేశాం.
  • వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ అయ్యిందనడానికి ఎలాంటి ఆధారాలు కనిపించ లేదు.

ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌

  •  టమోటాలు, వంకాయలపై పురుగుమందుల అవశేషాలు కనిపించాయి
  • ఫెస్టిసైడ్స్‌ (పురుగుమందుల) కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చు

ఎయిమ్స్, మంగళగిరి

  • ఏలూరు అంశాన్ని పరిగణలోకి తీసుకుని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితులపై అ«ధ్యయనం చేయాల్సి ఉంది.
  • పెస్టిసైడ్స్‌ ఎలా మనుషుల శరీరంలోకి చేరాయన్న దానిపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది
  • పురుగు మందుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి.
  • దీర్ఘకాలంలో సేంద్రీయ పద్ధతులను అనుసరించడంపై చైతన్యం కలిగించాలి.
  • భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరోచోట జరిగితే ఏం చేయాలన్న దానిపై వైద్య పరంగా కార్యాచరణను రూపొందించాల్సి ఉంది.
మరిన్ని వార్తలు