అలసత్వం వద్దు.. నాణ్యత ఉండాలి: సీఎం జగన్‌

19 Jul, 2021 15:57 IST|Sakshi

పోలవరం పనుల పురోగతిపై సీఎం జగన్ సమీక్ష

సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం పనుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే 42 గేట్లు అమర్చినట్టు సీఎంకు అధికారులు తెలిపారు. ఎగువ కాఫర్‌ డ్యాం పనులను పూర్తిచేశామన్న అధికారులు.. దిగువ కాఫర్ డ్యాం పనుల పరిస్థితిని వివరించారు. 2022 జూన్‌ కల్లా రెండు కాల్వలకు లింక్ పనులు పూర్తి కావాలని, టన్నెల్, లైనింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎర్త్‌కం రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులపై సీఎం ఆరా తీశారు.

పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌.. సోమవారం ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. పోలవరం నిర్వాసితులతో మాట్లాడిన సీఎం.. స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్‌ను పరిశీలించిన తర్వాత పోలవరం పనుల ఫొటో గ్యాలరీని వీక్షించారు.

అనంతరం పోలవరం ఆర్‌అండ్ఆర్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం.. ఆర్‌ అండ్‌ ఆర్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ‘‘ఆర్‌ అండ్ ఆర్‌ పనులపై దృష్టి పెట్టాలి. ఆర్‌ అండ్ ఆర్ పనులు పూర్తి నాణ్యతతో ఉండాలి. కచ్చితంగా నాణ్యత పాటించేలా అధికారిని నియమించాలి. కాలనీల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలి. వరదల సమయంలో నిర్వాసితులకు పునరావాసం ఏర్పాటు చేయాలి. పనులకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం సొంత నిధులు ఇస్తోంది. వచ్చే నెల ఆర్ అండ్ ఆర్ కాలనీలను సందర్శిస్తా. నిర్వాసితులకు జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఉన్నవారికి తిరిగి ఇచ్చేందుకు భూములు గుర్తించాలి. అనుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని’’ సీఎం జగన్‌ ఆదేశించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

>
మరిన్ని వార్తలు