అతివల ఆర్థికాభివృద్ధికి ‘ఆసరా’! 

25 Mar, 2023 03:43 IST|Sakshi

అతివల ఆర్థికాభివృద్ధికి 

‘ఆసరా’!స్వశక్తితో ఎదిగేందుకు భరోసా 

చిరు వ్యాపారాలతో కుటుంబానికి అండ 

ఇప్పటికే రెండు విడతల్లో లబ్ధి 

నేడు మూడో విడత పంపిణీకి ఏర్పాట్లు 

స్వయం సహాయక సంఘాల మహిళలకు వరంగా ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం 

సాక్షి, రాజమహేంద్రవరం: స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలన్నది సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం. ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో జీవించేలా ప్రోత్సహించేందుకు ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకానికి రూపకల్పన చేశారు. సంఘాల్లో మహిళలు తీసుకున్న రుణాలను విడతల వారీగా మాఫీకి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ. 485 కోట్లు అక్కచెల్లెమ్మలకు అందజేశారు. తాజాగా శనివారం మూడో విడతలో రూ.242.85 కోట్లు రుణమాఫీ చేయనున్నారు.  ఇందుకు అవసరమైన ఏర్పాట్లను డీఆర్‌డీఏ అధికారులు పూర్తి చేశారు. ఆదివారం నుంచి ఆసరా సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 

ఉద్దేశం ఇదీ..
సీఎం జగన్‌ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో తాను అధికారంలోకి వస్తే దశల వారీగా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఏప్రిల్‌ 11, 2019 నాటికి వారు తీసుకున్న రుణాలను ఎంతైతే అప్పు నిల్వ మిగిలి ఉంటుందో వాటిని నాలుగు విడతలుగా ఆయా సంఘాలకు చెల్లించేందుకు ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఆచరణలోకి తీసుకొచ్చారు.

తూర్పు గోదావరిలో ఇలా.. 
జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో 19 మండలాలున్నాయి. తొలి దశలో 27,297 సంఘాలకు రూ.241.98 కోట్లు, రెండో దశలో 27,417 సంఘాలకు రూ.244.04 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది. వైఎస్సార్‌ ఆసరా పథకంలో భాగంగా శనివారం మూడో విడత కింద  జిల్లాలో 27,413 స్వయం సహాయక సంఘాలకు లబ్ది చేకూరనుంది. రూ.242.85 కోట్ల నగదు మహిళల ఖాతాల్లో జమ కానుంది. సీఎం జగన్‌ నేరుగా బటన్‌ నొక్కి ప్రక్రియ ప్రారంభిస్తారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం కృషి చేసింది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా జాబితా రూపకల్పన చేశారు. సచివాలయాల వద్ద జాబితాను అందుబాటులో ఉంచారు. సభ్యులు చనిపోయినా నామినీ వివరాలు అధికారులకు అందజేస్తే పరిష్కరించి సొమ్ము అందజేసేలా చర్యలు తీసుకుంటారు. 

రేపటి నుంచి వారోత్సవాలు 
ఆదివారం నుంచి వాడవాడలా ఆసరా సంబరాలు నిర్వహించేందుకు డీఆర్‌డీఏ సన్నద్దం చేస్తోంది. గ్రామం, మండల కేంద్రం, పట్టణం, నగరం మెదలు అన్ని ప్రాంతాల్లో ‘గడప గడపకు ఆసరా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 25 నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు ప్రజలకు, మహిళలకు వివరించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళలకు చేస్తున్న ఆర్థిక సాయంపై అవగాహక కల్పించనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. 

టీడీపీ హయాంలో మోసం
టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలకు తీరని అన్యాయం జరిగింది. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ప్రకటించారు. దీంతో మహిళలు రుణాలు చెల్లించలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన బాబు హామీ ఊసే ఎత్తలేదు. చేసేది లేక మహిళలు చేసిన అప్పుకు వడ్డీతో సహా చెల్లించాల్సిన దుస్థితి తలెత్తింది. అప్పుకోసం బ్యాంకర్ల ద్వారా వేధింపులకు గురయ్యారు. తిరిగి 2019 ఎన్నికల సమంయలో మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు బాబు కొత్త పన్నాగం పన్నారు. ఎన్నికల సమయంలో తాయిలాలుగా పసుపూకుంకుమ కింద నగదు అందజేసి చేతులు దులుపుకున్నారు. గ్రహించిన డ్వాక్రా మహిళలు ఎన్నికల్లో బాబును దూరం పెట్టారు. వైఎస్సార్‌సీపీకి అధికారం కట్టబెట్టారు. 

స్వయం ఉపాధి దిశగా అడుగులు
ప్రభుత్వం అంజేస్తున్న ఆసరా సొమ్ముతో మహిళలు స్వయం ఉపాధి దిశగా దృష్టి సారిస్తున్నారు. దీంతో పాటు స్త్రీనిధి ద్వారా వచ్చిన సొమ్మును జమ చేసుకుని పాడి పశువుల పెంపకం, కిరాణా దుకాణం, గుడ్లు విక్రయించడం, టెంట్లు అద్దెకు ఇస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. 

జీవన ప్రమాణాల మెరుగునకు కృషి
మహిళల జీవన ప్రమాణాలు, ఆర్థిక ప్రగతి సాధించేందుకు ఆసరా పథకం ఎంతగానో దోహదం చేస్తుంది. రుణమాఫీ ద్వారా వచ్చే నగదుతో పాడి పరిశ్రమ, చిరు వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాం. స్వయం ఉపాధి పొందేలా అవగాహన కల్పిస్తున్నాం. ఫలితంగా మహిళలు కుటుంబ పోషణకు భర్తకు చేదోడుగా నిలుస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో ఆసరా నిధులు విడుదల­య్యాయి.  ఆసరా వారోత్సవాల సందర్భంగా అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతి గ్రామంలో వివరిస్తాం. 
–ఎస్‌.సుభాషిణి, పీడీ డీఆర్‌డీఏ.

మరిన్ని వార్తలు