బహ్రెయిన్‌లో భారతీయ బాధితులను వెనక్కి తీసుకురండి

14 Sep, 2021 03:56 IST|Sakshi

వీరిలో చాలామంది తెలుగు వారున్నారు

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

సాక్షి, అమరావతి :  బహ్రెయిన్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థ వేధింపులకు గురవుతున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం లేఖ రాశారు. ‘ఉపాధి కోసం వెళ్తే చిత్రహింసలు’ కథనానికి స్పందించి ఆయన ఈ మేరకు లేఖ రాశారు. యాజమాన్య దాష్టీకంతో చాలామంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నానని, స్వదేశానికి తిరిగి వచ్చేందుకు పలువురు సిద్ధంగా ఉన్నట్లు ఆ లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వీరిలో చాలామంది తెలుగువారు ఉన్నారని తెలిపారు. వీరిని వెనక్కి తీసుకురావడానికి అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల శాఖకు ఎలాంటి సమాచారం కావాల్సి ఉన్నా ఏపీ రెసిడెంట్‌ కమిషనర్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను సంప్రదించాలని వైఎస్‌ జగన్‌ ఆ లేఖలో సూచించారు. 

ముఖ్యమంత్రి లేఖతో బాధిత కుటుంబాల్లో ఆనందం
వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి లేఖ ఎంతో ధైర్యం కలిగించింది. వారిలో ఆనందం నెలకొంది. అయితే, బహ్రెయిన్‌ వెళ్లేందుకు వెల్డింగ్‌ ఇనిస్టిట్యూట్‌లకు రూ.లక్ష వరకు చెల్లించామని, ఆ సొమ్మును తమకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. తమ బిడ్డల కోసం తీసుకున్న చొరవపై వారు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు