‘దిశ’తో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ

23 Sep, 2021 04:31 IST|Sakshi

‘స్పందన’ సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌      

ఇప్పటి వరకు 70,00,520 మంది డౌన్‌లోడ్‌ 

ఫోన్‌ను షేక్‌ చేస్తే చాలు.. మహిళలకు భద్రత కల్పించేలా తీర్చిదిద్దాం

దిశ కార్యక్రమాన్ని కలెక్టర్లు, ఎస్పీలు ఓన్‌ చేసుకోవాలి

ఈ యాప్‌ ద్వారా మూడు నెలల్లో దాదాపు 900 సక్సెస్‌ స్టోరీలు 

ఏదైనా జరగక ముందే మహిళలకు అండగా నిలిచాం

సగటున 6 నిమిషాల్లోగా దిశ బృందం బాధితులను చేరుకుంటుంది

అక్కచెల్లెమ్మల ఫోన్లలో ఈ యాప్‌ ఉండేలా చర్యలు తీసుకోండి

సాక్షి, అమరావతి: దిశ అమలుతో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రూపుదిద్దుకోనుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు 70,00,520 మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని చెప్పారు. ఇందులో 3,78,571 ఎస్‌ఓఎస్‌ రిక్వెస్టులు వచ్చాయని, ఇందులో చర్యలు తీసుకోదగ్గవి 4,639 ఉన్నాయని తెలి పారు. బుధవారం ఆయన స్పందన సమీక్షలో మాట్లాడుతూ.. ‘దిశ’ మీ మానస పుత్రిక అని, ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు, ఎస్పీలు ఓన్‌ చేసుకోవాలని సూచించారు. ప్రతి మహిళ తన ఫోన్లో దిశ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవడం లక్ష్యం కావాలని, దీన్ని సవాలుగా తీసుకోవాల్సిందిగా పోలీసు యంత్రాంగానికి సూచించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

కలెక్టర్లు, ఎస్పీల ప్రతిష్ట పెరుగుతోంది
► దిశ యాప్‌ ద్వారా మూడు నెలల్లో దాదాపు 900 సక్సెస్‌ స్టోరీలు ఉన్నాయి. సక్సెస్‌ స్టోరీ అంటే.. ఏదైనా జరగకముందే దాన్ని నివారించి, మహిళలకు అండగా నిలవడం. ఫోన్‌ను షేక్‌ చేస్తే చాలు.. సగటున 6 నిమిషాల్లోగా మహిళకు భద్రత కల్పించేలా యాప్‌ను తీర్చిదిద్దాం.
► గత ప్రభుత్వం హయాంలో చార్జిషీటు వేయడానికి సగటున 300 రోజులు పడితే, ఇప్పుడు 42 రోజుల్లోగా వేస్తున్నాం. దేశంలో మహిళల మీద నేరాల్లో 91 శాతం కేసుల్లో కేవలం 2 నెలల వ్యవధిలోనే చార్జిషీటు దాఖలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రికార్డుల ప్రకారం జాతీయ సగటు 35 శాతంగా ఉంది. తిరుగులేని రీతిలో పోలీసు విభాగం పని చేస్తోంది.  è కలెక్టర్లు, ఎస్పీల ప్రతిష్ట గణనీయంగా పెరుగుతుంది. దేశం మొత్తం మీ గురించి మాట్లాడుకుంటుంది. ప్రతి సచివాలయంలో మహిళా పోలీసు ఉన్నారు. వలంటీర్లు ఉన్నారు. వీరి సేవలను వినియోగించుకోండి. మహిళల వద్ద ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లో తప్పకుండా దిశ యాప్‌ ఉండేలా చర్యలు తీసుకోండి. దీన్నొక సవాల్‌గా తీసుకోండి. గ్రామ, వార్డు సచివాలయాల్లో తని ఖీలకు వెళ్తున్నప్పుడు దిశ యాప్, దిశయాప్‌ డౌన్‌లోడ్‌ను ఒక అంశంగా తీసుకోండి.  

ఎఫ్‌ఐఆర్‌ నమోదులో వెనకడుగు వద్దు
► అధిక సంఖ్యలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నాయని పోలీసులు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. దిశ యాప్‌ ద్వారా ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యేలా మనం ప్రోత్సహిస్తున్నాం.  
► ఏపీలో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఎవరైనా వ్యాఖ్యలు చేసినా వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరంలేదు. 
► కేరళలో ఏడాదికి 7 లక్షలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అవుతున్నాయి. మహిళలు చైతన్యంగా ఉన్నప్పుడు, పోలీసులు స్నేహ పూర్వకంగా ఉన్నప్పుడే.. ఫిర్యాదుదారులు ముందుకు రాగలుగుతారు. అలాంటి సందర్భాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతాయి.  
► 70 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారంటే.. దాని అర్థం ఏంటంటే.. ఏ ఘటన జరిగినా ఫిర్యాదు చేయడానికి, కేసులు నమోదు చేయడానికి ఆ మహిళలకు అండగా ఉంటున్నట్టే లెక్క. ప్రతి మహిళ తన ఫోన్లో దిశ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవడం లక్ష్యం కావాలి.    

మరిన్ని వార్తలు