వారు పేదల శత్రువులు

2 Jan, 2022 03:18 IST|Sakshi
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో 61.75 లక్షల మంది లబ్ధిదారులకు పింఛను మొత్తాన్ని విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు.. మంచి చేస్తుంటే విమర్శలా?  పేదల కష్టాలు తెలుసా?

పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

అభివృద్ధి గురించి ఆలోచించని పార్టీలు విమర్శిస్తున్నాయి

కోర్టులకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు

ఓటీఎస్‌ పథకంపైనా దుష్ప్రచారం 

సినిమా టికెట్ల అంశంపై కూడా రాజకీయాలు చేస్తున్నారు

మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్నాం 

ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనన్ని పెన్షన్లు ఇస్తున్నాం 

పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లపై హక్కులు, ఇంగ్లిష్‌ మీడియం.. ఇలా ప్రతి మంచి కార్యక్రమానికీ ఏదో విధంగా అడ్డు తగలడమే వారి లక్ష్యం. చివరికి పేదవాడికి అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని.. సినిమా టికెట్ల రేట్లు నిర్ణయిస్తే, దాని మీద కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వీళ్లా.. పేదల గురించి ఆలోచించే వాళ్లు? ఇలాంటి వారందరూ పేద వాడికి శత్రువులు కాదా? ఆలోచించండి.   
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘పేదలకు మంచి చేస్తుంటే చూడలేని కొందరు వాటిని అడ్డుకోవాలని చూస్తున్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని గతంలో ఇలాంటి మంచి పనులు చేసిన చరిత్ర లేని పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి వారందరూ పేదలకు శత్రువులే’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. కొత్త సంవత్సరం రోజున శనివారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. అవ్వాతాతలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో.. అందులోని ప్రతి అంశాన్ని నెరవేరుస్తున్నామన్నారు. అవ్వాతాతల పెన్షన్‌ రూ.3 వేల వరకు పెంచుకుంటూ పోతాం.. అని ఇచ్చిన మాట తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరి సమక్షంలో పింఛన్‌ మొత్తాన్ని రూ.2,250కు పెంచుతూ సంతకం చేసి రెండున్నరేళ్లు అవుతోందన్నారు. ఈ రోజు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఆ మొత్తాన్ని రూ.2,500కు పెంచే కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

అభాగ్యులెందరున్నారో తెలుసా?
► ఈ జగన్‌ చేస్తున్న ధోరణి సరిగా లేదని చెప్పే వాళ్లు చాలా మంది ఉంటారు. మంచి చేస్తుంటే దాన్ని విమర్శించే వాళ్లూ ఉంటారు. వీళ్లందరికీ నేను ఒక్కటే చెప్పదల్చుకున్నాను. తమకు తాముగా జీవితమంతా కష్టపడినా నాలుగు రూపాయలు కూడా మిగిలించుకోలేని నిర్భాగ్యులు ఎంత మంది ఉన్నారో వీళ్లెవరికైనా తెలుసా? 
► కన్నపిల్లల నుంచి ఎటువంటి సహాయం లేని అభాగ్యులు, భర్తను కోల్పోయి తమకు తాము సంపాదించుకునే శక్తి లేని వితంతువులు, వివిధ సంప్రదాయ కుల వృత్తులలో తమ జీవితాలనే ధారపోసి, వయస్సు మళ్లుతున్న దశలో ఈరోజు ఆ కుల వృత్తి కొనసాగించలేక, ఆర్థికంగా ఆధారం లేక జీవితం ప్రశ్నార్థకంగా మారిన వృత్తులు ఎన్ని ఉన్నాయో వీళ్లందరికి ఎవరికైనా తెలుసా? 
► ఇలాంటి వాళ్లకు మనం సాయం చేస్తే దాన్ని మంచి అంటారా? లేక చెడు అంటారా? విమర్శించే ఇటువంటి వాళ్లందరికీ మీరే సమాధానం చెప్పాలి. ఈ రోజు సామాజిక పింఛన్లు నెలకు రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచబోతున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు కేవలం క్యాలెండర్లు మాత్రమే మారటం లేదు. దాదాపు 62 లక్షల కుటుంబాల్లో మరిన్ని చిరునవ్వులు రాబోతున్నాయి. 
► ఈ సమావేశం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు.. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి పొద్దున్నే గుడ్‌ మార్నింగ్‌ చెప్పి చేయవలసిన ఈ కార్యక్రమాన్ని ఈరోజు మధ్యాహ్నం నుంచి చేపడతారు.
► పుట్టుకతో కానీ, పుట్టిన తర్వాత కానీ.. అంగ వైకల్యానికి గురైన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు, తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధ పడుతున్న వారికి, తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమీయా, హీమోఫీలియా, బోధకాలు, చివరికి పక్షవాతం వచ్చి మంచానికో, వీల్‌ చెయిర్‌కో పరితమితమైన వాళ్లకు, కండరాల క్షీణత, కుష్టు వ్యాధి, కాలేయం, గుండె వంటివి ట్రాన్స్‌ప్లాంట్‌ జరిగిన నిరుపేదలకు.. వీళ్లందరికీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా పెన్షన్‌ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే.

దేశంలోనే అత్యధిక పెన్షన్‌లు
► దేశంలోనే అత్యధిక పెన్షన్‌లు ఇస్తున్న, అత్యధిక మొత్తాన్ని పెన్షన్‌లుగా ఇస్తున్న రాష్టం మనదే. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే ఎన్నికలకు కేవలం రెండు నెలలు ముందు వరకు ఇస్తున్న పెన్షన్‌ ఎంతనేది మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. రూ.1,000 మాత్రమే. 
► నేను ముఖ్యమంత్రిగా మొదటి సంతకం పెట్టినప్పటి నుంచి గత నెల వరకు మనం ఇచ్చిన పెన్షన్‌ రూ.2,250. ఇప్పుడు రూ.2,500. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్లు కేవలం 39 లక్షలు మాత్రమే. ఈ రోజు మనందరి ప్రభుత్వం దాదాపు 62 లక్షల మందికి పెన్షన్‌ ఇస్తోంది. ఎంత తేడానో ఆలోచించండి.  
► గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల కోసం నెలకు కేవలం రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేసేది. ఈ రోజు మనందరి ప్రభుత్వం ఏకంగా నెలకు రూ.1450 కోట్లు వెచ్చిస్తోంది. ఈ మొత్తం ఇకమీదట రూ.1,570 కోట్లు. ఈ 31 నెలల పాలనలో, కరోనా కష్ట కాలంలో, ఇతరత్రా ఇబ్బందులెన్ని ఉన్నప్పటికీ.. పేదల ఇక్కట్లు ఇంకా ఎక్కువ అని భావించి.. వారికి తోడుగా ఉండాలని ఒక్క పెన్షన్ల కోసమే దాదాపు రూ.40 వేల కోట్లపై చిలుకు ఖర్చు చేశాం.

కులం, మతం, పార్టీలు చూడలేదు
► ఈ రోజు పెన్షన్లకు కోటాల్లేవు. కోతల్లేవు. లంచాలు లేవు. జన్మభూమి కమిటీల అడ్డంకులు లేవు. ఎంత ఎక్కువ మందికి ఎగ్గొట్టాలి.. అన్న కుతంత్రాలు లేవు.  అందుకే కులం, మతం, వర్గం చూడలేదు. ఆఖరుకు మనకు ఓటు వేసినా వేయకపోయినా సరే ఇవ్వాలని చెప్పి ఏకంగా రూల్‌ తీసుకొచ్చాం. అర్హత ఉంటే చాలు.. పెన్షన్‌ వాళ్ల గడప వద్దకే వచ్చేట్టు చేస్తున్నాం. గత ప్రభుత్వానికి, నేడు మనందరి ప్రభుత్వానికి మధ్య ఒక్కసారి తేడా గమనించండి.
► ప్రతి నెలా ఒకటో తేదీన ఆ రోజు ఆదివారమైనా, సెలవు దినమైనా సరే సూర్యోదయానికి ముందే మీ గడప ముందుకు వచ్చి చిక్కటి చిరునవ్వుతో వలంటీర్‌ తలుపుతట్టి.. గుడ్‌ మార్నింగ్‌ చెప్పి, ఈసారైతే హ్యాపీ న్యూ ఇయర్‌ అని విష్‌ చేస్తూ.. పెన్షన్లు ఇస్తున్నారు.  

ఆస్పత్రిలో ఉంటే అక్కడికే వెళ్లి ఇస్తున్నారు
► అవ్వాతాతలు అనారోగ్యం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే నా వలంటీర్‌ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు స్వయంగా అక్కడికి వెళ్లి పెన్షన్‌ అందజేస్తున్న గొప్ప వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది. దాదాపు 2.70 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు ఇవాళ పెన్షన్ల పంపిణీ అనే యజ్ఞంలో పని చేస్తున్నారు.
► ప్రతినెలా ఒకటో తారీఖునే దాదాపు 95 శాతం మందికి పెన్షన్లు వాళ్ల చేతుల్లో పెడుతున్నారు. వాళ్లు ఇళ్ల వద్ద లేకపోతే 5వ తేదీ వరకు మూడు నాలుగుసార్లు వాళ్ల ఇంటికి వెళ్లి అందజేస్తున్నారు. ఇలాంటి గొప్ప వ్యవస్థ దేశం మొత్తం మీద ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే ఉంది. మిగిలిన రాష్ట్రాలు మన మాదిరిగా చేయడానికి ఆరాట పడుతున్నాయి.  
► ఈ రోజు పెన్షన్‌ అందుకోవడంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆ గ్రామ, వార్డు సచివాలయాన్ని, లేక  మీ వలంటీర్‌ను సంప్రదించండి. వారే దగ్గరుండి మీకు పెన్షన్‌ అందేలా సాయం చేస్తారు. 
► ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.   

ఓర్వలేకే విమర్శలు
► ఇంతగా మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వాన్ని.. ఇలాంటి మంచి చేసిన చరిత్ర ఎప్పుడూ లేని పార్టీలు, నాయకులు ఓర్వలేక విమర్శిస్తున్నారు. ఇలాంటి వారు ఏ రోజూ కూడా పేద పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం చదువులు చెప్పించాలని, మన పిల్లల మాదిరే వాళ్లూ గొప్పగా చదవాలని ఆలోచించలేదు. పైగా ఇంగ్లిష్‌ మీడియం వద్దని అడ్డుకున్న వాళ్లు వీళ్లే.
► పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. ఆ పేదలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే ఆస్తి వాళ్ల చేతుల్లో పెడుతుంటే ఓర్వలేక పోతున్నారు. గతంలో వారు చేయక, ఇప్పుడు మనం చేస్తుంటే.. అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లి, స్టేలు తీసుకొచ్చే అధ్వాన్నమైన పరిస్థితి. ఇటువంటి వాళ్లు మనల్ని విమర్శిస్తున్నారు.
► రాజధాని అని చెప్పుకుంటున్న అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే డెమొగ్రాఫిక్‌ ఇంబ్యాలెన్స్‌ వస్తుందని.. అంటే కులాల మధ్య అసమతుల్యత కారణంగా ఇబ్బందులు వస్తాయని కోర్టులకెళ్లి పిటిషన్‌లు  వేస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన నాయకులు ఉంటారా?  
► పేదలు అవసరమొచ్చినప్పుడు వాళ్ల ఇంటిని అమ్ముకునే లేక తాకట్టు పెట్టుకునే స్వేచ్ఛ, లేదా ఈ పెద్దవాళ్లు చేస్తున్నట్టు వాళ్ల పిల్లలకు ట్రాన్స్‌ఫర్‌ చేసే స్వేచ్ఛతో.. పూర్తి హక్కులతో కూడిన రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామంటే కూడా జీర్ణించుకోలేక విమర్శిస్తూనే ఉంటారు. సినిమా టికెట్ల విషయంలోనూ ఇంతే.
► మంచి చేసేందుకు నాలుగు అడుగులు ముందుకు వేస్తే రకరకాల కారణాలతో, రకరకాల కోణాలతో రాజకీయ స్వార్థంతో అడ్డుతగలడమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి వారికి 2022లో అయినా మంచి ఆలోచనలు కలగాలని కోరుకుంటున్నా. 

ప్రతి ఒక్కరికీ హ్యాపీ న్యూ ఇయర్‌
ఈ రోజు జనవరి ఒకటి.. రాష్ట్రంలో ఉన్న ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ, ప్రతి ఒక్కరికీ గుండెల నిండా ప్రేమతో మీ బిడ్డ హ్యాపీ న్యూ ఇయర్‌ తెలియజేస్తున్నాడు.

ఏ సమాజమైనా చీకటి నుంచి వెలుగులోకి రావాలని, వెనుకబాటు నుంచి అభివృద్ధి వైపు అడుగులు పడాలని ఆరాట పడుతుంది. అసమానతల నుంచి సమానత్వం అందాలని, తద్వారా ఆత్మాభిమానంతో బతకాలని, అరాచకం నుంచి చట్టబద్ధ పాలన వైపు పాలకులు ప్రయాణం చేయాలని తాపత్రయ పడుతుంది. అలాగే ఏ మనిషైనా, ఏ కుటుంబమైనా.. నిన్నటి కంటే నేడు బాగుండాలని, నేటి కంటే రేపు ఇంకా బాగుండాలని, రేపటి కంటే తమ భవిష్యత్‌ ఇంకెంతో బాగుండాలని కోరుకుంటారు. అటువంటి పాలన దిశగా ఈ రోజు మీ బిడ్ద అడుగులు వేస్తూ.. అభివృద్ధి బాటలో నడిపించ గలుగుతున్నాడని గర్వంగా చెబుతున్నాను. 

>
మరిన్ని వార్తలు