కర్నూలు ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
‘ఉయ్యాలవాడ విమానాశ్రయం’గా నామకరణం
ఈ నెల 28 నుంచి విమానాల రాకపోకలు
తొలుత విశాఖ, బెంగళూరు, చెన్నైకి విమాన సౌకర్యం
అనుమతులు రాకుండానే, రన్వే పూర్తవ్వకుండానే గతంలో ప్రారంభోత్సవం
రూ. 110 కోట్లతో పనులన్నీ పూర్తి చేసిన ప్రస్తుత ప్రభుత్వం
కర్నూలు చరిత్రలో ‘ఈ రోజు’ఎప్పటికీ నిలిచిపోతుందన్న ముఖ్యమంత్రి
తొలి స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళిగా ఈ విమానాశ్రయానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం’అని నామకరణం చేస్తున్నాం. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆమోదంగా ఇటీవల జరిగిన మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అండగా నిలిచారు. మీ కోసం మరింతగా పని చేస్తాం.రాష్ట్రంలో ఇప్పటివరకు తిరుపతి, కడప, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్లో విమానాశ్రయాలు ఉన్నాయి. ఇక నుంచి కర్నూలులోని ఓర్వకల్లులో కూడా విమానాశ్రయం ప్రారంభమవుతోంది. మనందరం నిర్మించుకోబోతున్న ‘న్యాయ రాజధాని’ నుంచి ఇతర రాష్ట్రాలు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను కలిపే ఎయిర్పోర్టుగా ఇది నిలబడుతుందని గర్వంగా చెబుతున్నా.
కర్నూలు: ఏపీ ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ‘స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం’అని ప్రజల హర్షధ్వానాల మధ్య నామకరణం చేశారు. సీఎం వైఎస్ జగన్ విజయవాడ నుంచి ఉదయం 11.45 గంటలకు ఓర్వకల్లు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్టు టెర్మినల్ బిల్డింగ్ వద్దకు చేరుకుని, జాతీయ జెండాను ఎగుర వేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, పుష్పాంజలి ఘటించారు.
అనంతరం రిబ్బన్ కట్ చేసి టెర్మిల్ బిల్డింగ్ ప్రారంభించారు. అనంతరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేసిన సభావేదికపై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రజలు, కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కర్నూలు చరిత్రలో ఈ రోజు (గురువారం) ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. కారణమేంటంటే కర్నూలు నుంచి ప్రయాణం అంటే ఇంతవరకు రోడ్డు, రైలు మార్గాలే అందుబాటులో ఉండేవని, ఇక నుంచి విమానయానం ప్రారంభమవుతోందన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఓర్వకల్లు ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలు మొదలవుతాయని చెప్పారు. బెంగళూరు, వైజాగ్, చెన్నైలకు సర్వీసులు నడుస్తాయని, ఇక్కడ ఒకేసారి నాలుగు విమానాలు పార్కింగ్ చేసే సౌకర్యం ఉందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
రూ. 110 కోట్లతో విమానాశ్రయం పనులు
‘ఉయ్యాలవాడ’ పేరుపై చిరంజీవి కృతజ్ఞతలు
విమానాశ్రయానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’పేరు పెట్టడంపై ప్రముఖ సినీ హీరో చిరంజీవి ముఖ్యమంత్రికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘దేశంలో తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం చాలా సంతోషం’అని చిరంజీవి పేర్కొన్నారు.
ఉయ్యాలవాడకు అసలైన నివాళి..