ఆధార్ నమోదు స్వచ్ఛందమే
యూఐడీఏఐ నిబంధనలకు అనుగుణంగా భద్రత చర్యలు
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా సవరణకు నూతన మార్గదర్శకాలు సోమవారం అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 30న జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా ప్రజాప్రాతి నిధ్య చట్టం 1950లో సవరణలు చేసినట్లు చెప్పారు. సవరించిన చట్టంలోని సెక్షన్ 23 ప్రకా రం ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారితో పాటు ఓట ర్లుగా నమోదు కావాలనుకునేవారు వచ్చే మార్చి నెలాఖరుకల్లా ఆధార్ సంఖ్యను పొందుపర్చాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల గుర్తింపును ఖరారు చేయడానికి, జాబితాలో వ్యక్తులను ప్రామాణీకరించడానికి, ఒక వ్యక్తి పేరు ఒకటికంటే ఎక్కువ చోట్ల నమోదు కాకుండా చూడటమే ఆధార్ సంఖ్య సేకరణ ప్రధాన ఉద్దేశమని వివరించారు.
ఇది పూర్తిగా స్వచ్ఛందమని, ఆధార్ నంబరును సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుండి తొలిగిం చటం ఉండదని స్పష్టం చేసారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉన్న వారి ఆధార్ నంబరు కోసం నూతనంగా ఫారమ్ 6 బి ప్రవేశపెట్టామన్నారు. ఇసిఐ, ఇరోనెట్, గరుడ, ఎన్వీఎస్పీ, వీహెచ్ఏ తదితర వెబ్ సైట్లలో నూతన దరఖాస్తులు అందుబాటులో ఉంచామన్నారు. 6బి దరఖాస్తును ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ఎన్నికల సంఘానికి సమర్పించవచ్చని చెప్పారు. ఎన్వీఎస్పీ, ఓటర్ల హెల్ప్లైన్ యాప్ని అనుసరించి స్వీయ ప్రామాణీకరణతో యూఐడీఐఏతో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబరు ఓటీపీని ఉపయోగించి ఆధార్ను ప్రామాణీకరించవచ్చని తెలిపారు.
మరో వైపు బూత్ లెవల్ అధికారి ఓటర్ల నుండి ఆధార్ నంబరు సేకరించడానికి ఇంటింటిని సందర్శిస్తారని, ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆధా ర్ నంబరు ఇవ్వలేని ఓటర్లు ఫారం 6బిలో పేర్కొన్న 11 ప్రత్యామ్నాయపత్రాలలో ఏదైనా ఒకటి సమ ర్పించాలని చెప్పారు. ఆధార్ సంఖ్య సేకరణ, నిర్వ హణలో జాగ్రత్తలు తీసుకుంటారని, ఇది జన బాహుళ్యంలోకి వెళ్లదని తెలిపారు. సేకరించిన హార్డ్ కాపీలు సురక్షితమైన కస్టడీలో ఉంటాయని, యూఐడీఏఐ నిబంధనలకు అనుగుణంగా భద్రత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
పోస్టర్ విడుదల
నూతన మార్గదర్శకాలపై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను డెప్యూటీ సీఈవో వెంకటేశ్వరరావు సోమవారం సచివాలయం ఐదో బ్లాక్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు, స్వీప్ కన్సల్టెంట్ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.