అక్టోబర్ 15 నుంచి కాలేజీలను తెరుస్తాం

6 Aug, 2020 18:05 IST|Sakshi

సెప్టెంబ‌ర్ మూడో వారం నుంచి సెట్‌ల నిర్వ‌హ‌ణ‌

సాక్షి, అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అక్టోబ‌ర్ 15 నుంచి అన్ని కాలేజీల‌ను తెరుస్తామ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ప‌లు ద‌ఫాలుగా వాయిదా ప‌డుతూ వ‌స్తోన్న సెట్‌ల‌ను సెప్టెంబ‌ర్ 3వ వారం నుంచి నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. 3, 4 ఏళ్ల డిగ్రీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కళాశాల‌ల్లో నాడు- నేడు కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతామ‌ని తెలిపారు. అన్ని ప్రైవేటు కళాశాల‌లు ఆన్‌లైన్‌లో అడ్మిష‌న్లు చేప‌ట్టాల‌ని సూచించారు. ఈ క్ర‌మంలో ఏవైనా కాలేజీలు అక్ర‌మాల‌కు పాల్పడితే వాటిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. (సెప్టెంబర్‌ 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం)

గురువారం ఆయ‌న సచివాల‌యం నుంచి మాట్లాడుతూ.. ఉన్న‌త విద్యా సంస్థ‌ల్లో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ 70 నుంచి 90 శాతం పెంచాల‌ని సూచించారు. క‌ర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ, కడపలో అర్కిటెక్చర్, తెలుగు సంస్కృత అకాడమీ, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ, పాడేరులో గిరిజన విశ్వ‌విద్యాల‌యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఈ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. ప్రకాశం జిల్లాలో టీచర్ ట్రైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామ‌ని ఆదిమూల‌పు సురేష్‌ పేర్కొన్నారు. (అక్టోబరు 15న తెరుచుకోనున్న కాలేజీలు: సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు