నేడు స్వదేశానికి ‘లిబియా బాధితులు’

28 Oct, 2020 04:14 IST|Sakshi

ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో స్పందించిన లిబియాలోని కంపెనీ యాజమాన్యం 

28 రోజులకు కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి

టెక్కలి: కిడ్నాపర్ల చెరలో బిక్కుబిక్కుమంటూ గడిపిన శ్రీకాకుళం జిల్లా యువకులు స్వదేశానికి రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ, మంత్రి సీదిరి అప్పలరాజు, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ఎప్పటికప్పుడు వారి విడుదలకు చర్యలు చేపట్టడంతో 28 రోజుల్లో కిడ్నాపర్ల చెర నుంచి వారికి విముక్తి లభించింది. సంతబొమ్మాళి మండలం సీతానగరానికి చెందిన బత్సల వెంకటరావు, బత్సల జోగారావు, బొడ్డు దానయ్య లిబియా నుంచి స్వదేశానికి వస్తూ ట్రిపోలీ ఎయిర్‌పోర్ట్‌ మార్గ మధ్యలో కిడ్నాప్‌కు గురైన ఘటన సంచలనం కలిగించింది. మంత్రి సీదిరి అప్పలరాజు, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. లిబియాలో భారత ప్రభుత్వ దౌత్య కార్యాలయం నుంచి కంపెనీ ప్రతినిధులతో చర్చించి కిడ్నాపర్ల నుంచి వారిని విడుదల చేసేందుకు అన్ని విధాలుగా ప్రయతి్నంచారు. కిడ్నాపర్ల చెర నుంచి బయట పడిన యువకులు నేడు ఢిల్లీకి రానుండగా మరో రెండు రోజుల్లో ఇళ్లకు చేరుకోనున్నారు. 

ప్రభుత్వ చొరవ మరిచిపోలేం 
ట్రిపోలీ ఎయిర్‌పోర్ట్‌ వద్ద కిడ్నాప్‌కు గురయ్యాం. ప్రభుత్వ చొరవతో లిబియాలో మా కంపెనీ ప్రతినిధులు కిడ్నాపర్లతో చర్చలు జరిపి మమ్మల్ని విడిపించారు. ప్రభుత్వ చొరవ మరిచిపోలేం. 
    – బత్సల వెంకట్రావు 

ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం  
కిడ్నాప్‌కు గురైన తర్వాత జీవితంపై ఆశలు వదులుకున్నాం. ఎంతో భయపడ్డాం. అయితే మమ్మల్ని విడిపించడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో చొరవ చూపారు.  
– బత్సల జోగారావు 

మరో రెండు రోజుల్లో ఇంటికి.. 
మమ్మల్ని విడిపించడంలో మంత్రి అప్పలరాజు, ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్‌ కృషి చేశారు. 2 రోజుల్లో ఇంటికి వచ్చేస్తున్నాం.
– బొడ్డు దానయ్య  

మరిన్ని వార్తలు