ఏడాది చివరకు జమ్మూలో శ్రీవారి ఆలయ పనుల పూర్తి 

20 Apr, 2022 05:26 IST|Sakshi
పనులు పరిశీలిస్తున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

పనులను పరిశీలించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  

తిరుమల:  జమ్మూ సమీపంలోని మాజిన్‌ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్‌ అధికారులు పనుల పురోగతిని చైర్మన్‌కు వివరించారు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించాల్సిన వాటిలో ఏపీలోని కోటప్పకొండలో తయారు చేస్తున్న రాతి స్తంభాలు తదితరాలు అందాల్సి ఉందని, మరికొన్ని స్థానికంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పనులు ఈ ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు తయారు చేసుకుని అమలు చేయాలని చైర్మన్‌ అధికారులను ఆదేశించారు. 

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ కాస్త తగ్గింది. శ్రీవారిని సోమవారం 64,157 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా స్వామి వారికి 29,720 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.3.84 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్‌ లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. 

>
మరిన్ని వార్తలు