శ్రీశైలంలో డ్రోన్ల సంచారంపై సమగ్ర దర్యాప్తు

6 Jul, 2021 08:16 IST|Sakshi

శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలంలో డ్రోన్ల సంచారంపై పోలీస్‌ శాఖ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. ఎస్పీ ఫక్కీరప్ప సోమవారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రుతితో ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై చర్చించారు. ఇదిలా ఉండగా.. పోలీసులు సున్నిపెంటలో అనుమానిత వ్యక్తుల ఇళ్లను తనిఖీ చేశారు. లంబాడీ కాలనీలో నివాసం ఉంటున్న గుంటె బాలకృష్ణ అలియాస్‌ బాలును అదుపులోకి తీసుకున్నారు.

గతంలో తాను ఇరిగేషన్‌ అధికారుల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెంకు చెందిన వెంకట్‌ అనే వ్యక్తి నుంచి డ్రోన్‌ను అద్దెకు తీసుకుని డ్యాం పరిసర ప్రాంతాలను వీడియో తీసినట్టు బాలకృష్ణ పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం తాను డ్రోన్‌ను వినియోగించడం లేదన్నాడు. అతడికి చెందిన కంప్యూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా సోమవారం రాత్రి మరోసారి శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో డ్రోన్‌ తిరగడం కలకలం రేపింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డులో డీఎస్పీ శ్రుతి పోలీస్‌ సిబ్బందితో వెళుతుండగా ఇది కనిపించింది. 

మరిన్ని వార్తలు