సీఎం జగన్‌కు వ్యతిరేకంగా గత పదేళ్లుగా కుట్రలు: సజ్జల

24 Jun, 2021 17:43 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా గత పదేళ్లుగా కుట్రలు జరుగుతూనే ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఆనాడు వైఎస్‌ జగన్‌పై కేసులు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు వ్యవహారం వెలుగు చూశాకే, వైఎస్‌ జగన్‌పై దాదాపు 30 కేసులు బనాయించారన్నారు. 

కాగా, టీడీపీ నేతలపై ఉన్న కేసులను నాటి చంద్రబాబు ప్రభుత్వం కొట్టేసిందని, వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట అని సజ్జల పేర్కొన్నారు. ఈటీవీ, ఏబీఎన్‌, టీవీ5 ఛానల్‌లు విషప్రచారానికి అలవాటు పడ్డాయని, ఇందులో భాగంగానే పదే పదే కేసులు వేస్తూ ప్రభుత్వ పనితీరుకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించారు. పెట్రో ధరలు ఎవరు పెంచారో చెప్పకుండా వార్తలు రాస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.

ఏపీ, తెలంగాణల మధ్య నీటి వాటాల పంపకంపై ఆయన మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నామని, కేటాయించిన దాని కంటే ఒక్క చుక్క నీరు కూడా ఎక్కువ తీసుకోవడం లేదని వెల్లడించారు. కేటాయింపులకు అనుగుణంగానే ఏపీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయని, మొత్తంగా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. పరీక్షల విషయమై స్పందిస్తూ.. విద్యార్థుల భవిష్యత్‌ కోసమే పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు