విజయవాడ: ప్రేమా లేదు.. పెళ్లి లేదూ.. భర్త చనిపోతే ఆస్తి కోసం చేరదీశాడంతే!

14 Sep, 2022 13:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆటోనగర్‌ (విజయవాడ తూర్పు): ఓ మహిళ భర్త కరోనాతో గత ఏడాది మృతి చెందారు. ఆమెకు పిల్లలు లేరు. ఆమె పేరిట రూ.1.20 కోట్ల ఆస్తి ఉంది. ఆ వితంతువును ఓ కానిస్టేబుల్‌ నమ్మించాడు. అతనికి అప్పటికే పెళ్లయింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వితంతు మహిళతో కానిస్టేబుల్‌ పరిచయం పెంచుకున్నాడు. అనధికారికంగా పెళ్లి చేసుకున్నాడు. ఆపై ఆమె ఆస్తిని కాజేసేందుకు యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

విజయవాడ పటమట పోలీసుల కథనం మేరకు.. విజయవాడ రామలింగేశ్వరనగర్‌కు చెందిన మహిళ భర్త గతేడాది కరోనాతో మృతి చెందాడు. వారికి పిల్లలు లేరు. కూచిపూడి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగం చేస్తున్న దేవేంద్రకు కొద్ది    నెలల క్రితం ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరు ఓ గుడిలో దండలు మార్చుకొని అనధికారికంగా వివాహం చేసుకున్నారు. రామలింగేశ్వరనగర్‌లో ఆ మహిళకు రూ.1.20 కోట్ల విలువు చేసే ఇల్లు ఉంది.

ఆమెకు తెలియకుండా ఆ ఇంటిని కానిస్టేబుల్‌ బేరానికి పెట్టాడు. కొనేందుకు వచ్చిన వారి నుంచి రూ.40 లక్షలు తీసుకున్నాడు. ఈ విషయం ఆ మహిళకు ఆలస్యంగా తెలిసింది. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని దేవేంద్రపై వత్తిడి చేసింది. అయితే అతను పట్టించుకోకపోవడంతో పటమట పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ జాన్‌బాషా తెలిపారు. 

మరిన్ని వార్తలు