కృష్ణాలో స్థిరంగా వరద ప్రవాహం

22 Sep, 2020 05:57 IST|Sakshi
సోమవారం సాగర్‌ నుంచి 16 క్రస్ట్‌ గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

శ్రీశైలంలోకి 3.10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

ప్రకాశం బ్యారేజీ నుంచి 3.07 లక్షల క్యూసెక్కులు కడలిలోకి

సాక్షి, అమరావతి/ హొసపేటె/ శ్రీశైలం ప్రాజెక్ట్, విజయపురిసౌత్‌ (మాచర్ల): పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతుండగా.. పెన్నమ్మ ఉగ్రరూపం దాల్చింది. 

► సోమవారం సాయంత్రానికి తుంగభద్ర డ్యాం మొత్తం 33 గేట్లలో 30 గేట్లను ఎత్తి సుమారు 1,02,830 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 
► శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 3,10,232 క్యూసెక్కులు చేరుతుండగా..  పది గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి 2, 78,000 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 211.96 టీఎంసీల నిల్వతో నీటిమట్టం 884.40 అడుగులుగా నమోదైంది. 
► నాగార్జునసాగర్‌ నుంచి మిగులుగా ఉన్న 2,38,624 క్యూసెక్కులను 16 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. జలాశయ నీటిమట్టం 589.50 అడుగుల్లో 310.55 టీఎంసీలకు సమానంగా ఉంది. 
► పులిచింతల ప్రాజెక్టు 14 గేట్ల ద్వారా 2,80,716 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
► ప్రకాశం 70 గేట్లు ఎత్తి.. మిగులుగా ఉన్న 3,07,918 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు.
► ఉప నదులు పాపాఘ్ని, కుందూ ఉప్పొంగడంతో పెన్నమ్మ ఉగ్రరూపం దాల్చింది. గండికోట, మైలవరం గేట్లు ఎత్తేయడంతో సోమశిలలోకి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తేసి.. 1.38 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
► గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 3,36,958 క్యూసెక్కులు చేరుతుండగా, మిగులుగా ఉన్న 3,32,958 క్యూసెక్కులను కడలిలోకి వదులుతున్నారు.  

>
మరిన్ని వార్తలు