కృష్ణా, గోదావరిలో స్థిరంగా వరద

7 Sep, 2020 05:37 IST|Sakshi
పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉన్న శ్రీశైలం డ్యాం

శ్రీశైలం ప్రాజెక్టులోకి 68,731 క్యూసెక్కుల ప్రవాహం

తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద

సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్‌: కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల నుంచి విడుదల చేస్తున్న నీటికి తుంగభద్ర డ్యామ్‌ నుంచి వదులుతున్న ప్రవాహం తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 68,731 క్యూసెక్కులు చేరుతున్నాయి. కుడి గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 17,808 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయిలో అంటే 885 అడుగుల్లో 215.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 

► సాగర్‌లోకి 17,808 క్యూసెక్కులు చేరుతుండగా.. అదే స్థాయిలో ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ ప్రాజెక్టు, విద్యుత్‌ కేంద్రం ద్వారా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587.7 అడుగుల్లో 305.92 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
► పులిచింతల ప్రాజెక్టులోకి 5,085 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా అవసరాల కోసం పది వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 45.62 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
► ప్రకాశం బ్యారేజీలోకి 18,963 క్యూసెక్కులు చేరుతుండగా, కృష్ణా డెల్టాకు 16,882 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
► తుంగభద్ర డ్యామ్‌లో పూర్తి స్థాయిలో 100.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. వరద ప్రవాహం 36,689 క్యూసెక్కుల్లో కాలువలకు 10,519 క్యూసెక్కులు వదిలి.. స్పిల్‌ వే గేట్లు, విద్యుత్‌కేంద్రం ద్వారా 28,423 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
► గోదావరి ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,96,413 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 12,900 క్యూసెక్కులు వదిలి, మిగులుగా ఉన్న 2,83,513 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. 

మరిన్ని వార్తలు