జూలై 1 నుంచి కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం

9 Apr, 2021 09:20 IST|Sakshi

వచ్చే కేబినెట్‌ మీటింగ్‌ నాటికి భూసేకరణ పూర్తి కావాలి

వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడుపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్‌

విలేజ్‌ క్లినిక్‌ల నుంచి బోధనాసుపత్రుల వరకు జాతీయ స్థాయి ప్రమాణాలు ఉండాలి

కొత్త మెడికల్‌ కాలేజీల్లో నియామకాలు పకడ్బందీగా జరగాలి

వైద్యులు, సిబ్బంది కొరత ఉందనే విమర్శలు రాకూడదు

మెడికల్‌ విభాగాలన్నీ ఒకే గొడుగు కింద ఉంటే నియామకాలు సులువు

నాడు–నేడు కింద చేపట్టే పనులకు నిధుల విడుదలలో జాప్యం ఉండకూడదు

వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌కు మంచి రంగులు వేయాలి

సాక్షి, అమరావతి: జూలై 1వ తేదీ నుంచి కొత్త మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే కేబినెట్‌ సమావేశం నాటికి మొత్తం మెడికల్‌ కాలేజీలకు సంబంధించి భూ సేకరణ పూర్తి చేయాలని  అధికారులకు సూచించారు. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల నుంచి పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల వరకు జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎస్‌వోపీలు రూపొందించాలన్నారు.

వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త మెడికల్‌ కాలేజీల్లో రిక్రూట్‌మెంట్‌ పకడ్బందీగా జరగాలని.. వైద్యులు, సిబ్బంది కొరత ఉందనే విమర్శలు రాకూడదని  చెప్పారు. మెడికల్‌ డిపార్ట్‌మెంట్లు అన్నీ ఒకే గొడుగు కింద ఉంటే.. రిక్రూట్‌మెంట్‌ సులువుగా, ఒక పద్ధతిగా జరుగుతుందని అన్నారు.

నాడు–నేడు కింద చేపట్టే పనులకు ఇచ్చే నిధుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్‌ కాలేజీలకు గాను 8 కాలేజీలకు భూసేకరణ పూర్తయ్యిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.  మిగిలిన ఎనిమిదింటికి కూడా భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 16 కొత్త మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన స్టేటస్‌ను అధికారులు సీఎంకు వివరించారు.

ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌కు నిధులు విడుదల చేయండి
వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌కు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలి. ఈ క్లినిక్స్‌కు మంచి రంగులు వేయాలి. చూడగానే ఇది ఆసుపత్రి అనే భావన కలిగించేలా, ఆకట్టుకునేలా ఉండాలి. 
నాడు–నేడు స్కూల్స్‌ తరహాలో వైబ్రెంట్‌గా ఉండాలి. (అన్ని చోట్ల షెడ్యూల్‌ ప్రకారం పనులు జరుగుతున్నాయా.. లేదా? అని ఈ సందర్భంగా సీఎం ఆరా తీశారు.) 

ఆసుపత్రుల నిర్వహణకు మేనేజర్ల నియామకం  
ఆసుపత్రుల నిర్వహణను మెడికల్‌ సూపరింటెండెంట్‌లకే వదిలేయడం వల్ల మేనేజ్‌మెంట్‌ విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. నిర్వహణ శాస్త్రీయంగా ఉండటానికి హాస్పిటల్‌ మేనేజర్‌లను నియమించుకోవాలని సీఎం సూచించారు.
క్లినికల్‌ నిర్ణయాలు మినహా మిగిలిన ఆసుపత్రి నిర్వహణను మేనేజర్లు పర్యవేక్షిస్తారని, పలు రాష్ట్రాల్లో ఈ విధానం ఇప్పటికే అమలవుతోందని, మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు తెలిపారు.

ఆస్పత్రుల నిర్వహణ చాలా ముఖ్యం
ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించి హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నిధుల విడుదల విషయంలో ఎక్కడా జాప్యం జరగకూడదు. దీనిపై ఒక విధానాన్ని రూపొందించి, ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలి.
ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సదుపాయాలు ఎలా ఉంటాయో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అదే విధమైన సదుపాయాలు రోగులకు అందాలి. హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి మెడికల్‌ కాలేజీల్లో ప్రత్యేకంగా కోర్స్‌ ఏర్పాటు చేయాలి. 
హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రముఖ ప్రైవేట్‌ ఆసుపత్రులను భాగస్వాములను చేసి, వారి సూచనలు, సలహాలు తీసుకోవాలి. ప్రైవేట్‌లో ఎలా చేస్తున్నారో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అలా జరగాలి. ఆసుపత్రుల నిర్మాణం జరిగేటప్పుడే అవసరమైన సదుపాయాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి.
ప్రతి ఆసుపత్రి నిర్వహణపై ఆడిట్, సూపర్‌ విజన్‌ జరగాలి. ఇవి ఉంటేనే మనం అనుకున్న విధంగా సదుపాయాలు ప్రజలకు అందుతాయి. హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ పోస్ట్‌ల పదోన్నతులు సిఫార్సుల ద్వారా కాకుండా పనితీరు ఆధారంగా వుండాలి.
చదవండి:
రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్‌ 
తిరుపతి ఓటర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖ

మరిన్ని వార్తలు