‘ఏపీలో కరోనా డెత్‌ రేట్‌ బాగా తగ్గింది’

21 Oct, 2020 13:27 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులను తగ్గించటంలో విజయం సాధించామని, కరోనాతో మృత్యువాత పడేవారి సంఖ్య బాగా తగ్గిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు. బుధవారం కరోనా కట్టడి అవగాహన కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 31 వరకు కరోనా అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్‌ నీలం సాహ్ని విజయవాడలో భారీ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్‌లాక్ తర్వాత వ్యవస్థలన్నీ పునరుద్ధరించామన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించి కరోనా పెరగకుండా సహకరించాలని కోరారు. ( ‘వైఎస్సార్‌ బీమా పథకం’ ప్రారంభం )

కాగా, కోవిడ్‌ నేపథ్యంలో వచ్చే పది రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. కోవిడ్‌ వస్తే ఏం చేయాలన్న దానిపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని..104 నంబర్‌కు ఫోన్‌ చేయడం, తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరుచూ శుభ్రంగా కడుక్కోవడం వంటి వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.

>
మరిన్ని వార్తలు