కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ నెల 21 తర్వాత తగ్గుదల
సెప్టెంబర్ 15 తర్వాత మిగతా జిల్లాల్లో..
ఎపిడెమాలజిస్ట్ల అభిప్రాయం
సాక్షి, అమరావతి: వచ్చే నెల రెండో వారం నాటికి ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని ఎపిడెమాలజిస్ట్లు(అంటువ్యాధుల నిపుణులు) చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ వ్యాప్తి, ఇన్ఫెక్షన్ రేటు తదితర అంశాలను పరిశీలించి ఈ విధంగా అభిప్రాయపడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సోమవారం ప్రముఖ ఎపిడెమాలజిస్ట్లతో జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. అవేంటంటే..
► కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రస్తుతం వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఆగస్ట్ 21 తర్వాత ఈ రెండు జిల్లాల్లో తగ్గుముఖం పడుతుంది.
► అనంతపురం, శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సెప్టెంబర్ 15 తర్వాత వ్యాధి వ్యాప్తి తగ్గే అవకాశాలున్నాయి.
► ప్రస్తుతం రోజుకు 70 నుంచి 80 మరణాలు నమోదవుతుండగా.. ఆగస్ట్ 20 తర్వాత 50 కంటే తగ్గే అవకాశాలున్నాయి.
► ప్రస్తుతం 0.9 శాతం మరణాలు నమోదవుతుండగా.. ఇది 0.5 శాతం కంటే తగ్గుతుంది.
► ఎక్కువ పరీక్షలు చేయడం, ఎక్కువ మందిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడం వల్ల మరణాల నియంత్రణ సాధ్యమవుతోంది.