సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా పది రోజులుగా అత్యధిక పాజిటివిటీ రేటు నమోదవుతోంది. సగటున రోజుకు 21 శాతం పైనే పాజిటివిటీ రికార్డవుతోంది. మరోవైపు దేశంలో 72 శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే మృతుల్లో 75 శాతం మంది కూడా ఆ పది రాష్ట్రాలకు చెందినవారేనని తేలింది.
కొన్ని రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే కూడా ఎక్కువగా మరణాలు నమోదవుతున్నాయని తాజా గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు క్రమంగా కరోనా తీవ్రత తగ్గే అవకాశముందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలాఖరుకు కాస్త అదుపులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు.