ఆస్పత్రి బయటే ప్రాణాలు వదిలిన రోగి 

29 Apr, 2021 12:38 IST|Sakshi
రోడ్డుపై కుప్పకూలిన వృద్ధుడు   

శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో వచ్చిన రోగిని చేర్చుకోకపోవడంతో ఆస్పత్రి ఎదుటే మృత్యువాత పడిన హృదయ విదారక ఘటన మంగళవారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నగరం నవభారత్‌ జంక్షన్‌ సమీపంలోని యాతపేటకు చెందిన రాములు (60) అనే వృద్ధుడు కరోనా లక్షణాలతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. జిల్లా అధికారులకు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు చూపిస్తున్న లెక్కల్లో అక్కడి బెడ్లు ఖాళీగానే ఉన్నప్పటికీ బెడ్లు ఖాళీ లేవన్న సాకుతో ఆ వృద్ధుడిని ఆస్పత్రిలో చేర్చుకోలేదు. కొన్ని గంటలపాటు అదే పరిస్థితి ఏర్పడింది.

తీవ్రంగా ఆయాసం రావడంతో ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న వృద్ధుడిని చూసి చుట్టుపక్కల ఉన్నవారు చలించిపోయారు. ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో వారు ఓ ఆక్సిజన్‌ సిలిండర్‌ను అక్కడికే తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి వృద్ధుడికి అమర్చారు. కొద్దిగా పరిస్థితి కుదుటపడడంతో వృద్ధుడు మూత్ర విసర్జనకు వెళతానని సిబ్బందిని అడిగాడు. అయితే ఆస్పత్రిలో ఉన్న మూత్రశాలను వినియోగించుకోవడానికి వారు నిరాకరించడంతో రోడ్డుపైకి వెళ్లాడు. అక్కడ ఎండ వేడిమి తట్టుకోలేక రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రి లోపలకు తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా ఆస్పత్రి సిబ్బంది సహకరించలేదు. మళ్లీ అక్కడున్న వారంతా గొడవ చేయడంతో లోపలకు తీసుకెళ్లి వృద్ధుడు మృతి చెందాడని చెప్పి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

చదవండి: కొత్త సెల్‌ఫోన్‌: బైక్‌ దిగగానే ఒక్కసారిగా షాక్‌.. 
ఆన్‌లైన్‌ పేమెంట్‌కు ఒప్పుకోని ఆస్పత్రి యాజమాన్యం

మరిన్ని వార్తలు