కరోనా కట్టడిలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ
గతేడాది మార్చి 10న నెల్లూరులో తొలి కేసు
జూన్–నవంబర్ మధ్య ఉధృతం
డిసెంబర్ నుంచి తగ్గుముఖం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోకి కోవిడ్–19 మహమ్మారి ప్రవేశించి సరిగ్గా ఏడాది పూర్తయింది. యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ఐదారు నెలల పాటు రాష్ట్ర ప్రజలను నిలువెల్లా వణికించింది. చైనాలో పుట్టి.. పాశ్చాత్య దేశాలకు పాకి.. అక్కడి నుంచి భారత్లోకి, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్కు చేరిన ఈ మహమ్మారి భారీ నష్టాన్నే మిగిల్చింది. రాష్ట్రంలోనే తొలి కేసు 2020 మార్చి 10న నెల్లూరు వాసికి సోకినట్టు నిర్ధారణ అయింది. అలా మొదలై గత ఏడాది నవంబర్ వరకూ ఉధృతంగా కొనసాగింది. ఈ ఏడాది మార్చి 8వ తేదీ నాటికి రాష్ట్రంలో 7,176 మంది ప్రాణాలను బలిగొంది.
కరోనా కట్టడిలో ఏపీ ఫస్ట్
► కోవిడ్–19 నియంత్రణలో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ (టీటీటీ) అనే లక్ష్యంతో కరోనాను నియంత్రించగలిగారు.
► దేశంలో మిలియన్ జనాభాకు ఎక్కువ టెస్టులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు నెలకొల్పింది. ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేని స్థాయి నుంచి 14 ల్యాబొరేటరీలు సమకూర్చుకుని దీటుగా నిలబడింది.
► కోవిడ్ బాధితుల కోసం క్వారంటైన్ కేంద్రాలు నెలకొల్పడమే కాకుండా వారికి ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని సైతం ఉచితంగా సమకూర్చింది.
► కోవిడ్ చికిత్సనూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి రికార్డు సృష్టించింది. వెంటిలేటర్లు, ఆక్సిజన్ పైప్లైన్లు, పడకల ఏర్పాటు వంటి విషయాల్లో ఏ రాష్ట్రమూ చేయనంత కృషి చేయగలిగింది.
► కోవిడ్ నియంత్రణకు, కిట్లకు, ల్యాబొరేటరీలు వంటి వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1,458.27 కోట్లు ఖర్చు చేసింది. నేటికీ ఇందుకోసం ఎంత అవసరమైనా నిధులు వెచ్చిస్తోంది.
► మందులు, ఆక్సిజన్, పీపీఈ కిట్లు, మాస్కులు వంటి వాటికి రూ.783 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.
► టెస్టింగ్లు, ట్రేసింగ్, రవాణా, క్వారంటైన్ కేంద్రాలు, కోవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణ, అవగాహన కార్యక్రమాలకు కలెక్టర్ల ఆధ్వర్యంలో రూ.559.07 కోట్లు ఖర్చు చేశారు.
కీలక ఘట్టాలు
► ఫ్రాన్స్ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 2020 మార్చి10న ఇది తొలి కోవిడ్ కేసుగా నమోదైంది.
► ఒక నెలలో అత్యధిక టెస్టులు చేసింది 2020 అక్టోబర్లో. ఆ నెలలో 22,39,550 టెస్టులు చేశారు.
► 2020 ఆగస్ట్లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ నెలలో 2,94,930 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
► 2020 ఆగస్ట్లో అత్యధికంగా 2,646 మంది కోవిడ్తో మృతి చెందారు. ఇదే నెలలో అత్యధికంగా 16.66 శాతం పాజిటివిటీ నమోదైంది.
► 2020 డిసెంబర్ నుంచి కోవిడ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. నవంబర్లో 42,783 కేసులు నమోదు కాగా, డిసెంబర్లో 13,863 మాత్రమే నమోదయ్యాయి