సాక్షి, అనంతపురం: కరోనా మహమ్మారికి విరుగుడుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు వ్యాక్సిన్ కనుగొనే పనిలో ఉండగా.. కొందరు కేటుగాళ్లు మాత్రం కరోనా భయాలే పెట్టుబడిగా అమాయక ప్రజానీకాన్ని బురిడి కొట్టించి డబ్బులు దండుకుంటున్నారు. జపాన్లో తయారైన ట్యాగ్ని మెడలో వేసుకుంటే కరోనా సోకదని చెవుల్లో పూలు పెడుతున్నారు. రూ.300 లకు ఒక ట్యాగ్ చొప్పున విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో వెలుగు చూసింది.
(ఏపీలో కొత్తగా 7,627 కరోనా కేసులు)
వివరాలు.. ‘వైరస్ షటౌట్ మేడిన్ ఇన్ జపాన్’ ట్యాగ్తో కరోనాకు దూరంగా ఉండొచ్చని కొందరు వ్యక్తులు ఐడీ కార్డులను పోలిన ట్యాగ్ల అమ్మకాలు సాగించారు. ఆ ట్యాగ్ మెడలో వేసుకుంటే పాజిటివ్ వ్యక్తులు, వైరస్ జాడలు ఉన్న ప్రదేశానికి 10 అడుగుల దూరంలోనే అలారమ్ మోగుతుందని నమ్మబలికారు. ఇదంతా నిజమని నమ్మిన గుంతకల్లు, పరిసర ప్రాంతాల ప్రజలు ఆ ట్యాగ్లను విపరీతంగా కొనుగోలు చేశారు. కరోనాకు మందులుగాని, వ్యాక్సిక్గాని మార్కెట్లో లేదని మోసపోవద్దని జన విజ్ఞాన వేదిక ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ట్యాగ్ల పేరుతో దండుకుంటున్న కేటుగాళ్ల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు పోలీసులను కోరారు.
(ఆస్పత్రి అడ్డాగా చిన్నారుల అక్రమ రవాణా)