కృష్ణా జిల్లాలో దిగ్విజయంగా ముగిసిన ‘డ్రై రన్’

28 Dec, 2020 13:19 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాలోని అయిదు సెంటర్లలో కరోనావైరస్‌‌ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రక్రియ దిగ్విజయంగా ముగిసింది. జిల్లాలోని అయిదు సెంటర్లలో వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించారు. డ్రై రన్ ఏ విధంగా కొనసాగిందో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆద్వర్యంలోని‌ కమిటీ పరిశీలించింది. ప్రతీ సెంటర్ లో 25 మంది చొప్పున వ్యాక్సినేషన్ వేశారు. ప్రధానంగా వ్యాక్సిన్ సరఫరా, భద్రత, కోవిన్ యాప్ పరిశీలన, అత్యవసర పరిస్ధితులలో ఏం చేయాలనేది ఈ డ్రై రన్ ద్వారా తెలుసుకున్నారు. (చదవండి: నేడు 4 రాష్ట్రాల్లో డ్రై రన్‌)

విజయవాడ జీజీహెచ్‌, ఉప్పులూరు పీహెచ్‌సీ, ప్రకాష్‌ నగర్‌ ఆస్పత్రి, పూర్ణ హార్ట్‌ ఆస్పత్రి, కృష్ణవేణి కళాశాలలో డ్రై రన్‌ నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క సెంటర్‌కు అయిదుగురు వ్యాక్సినేషన్‌ అధికారులను నియమించారు. టీకా డ్రై రన్‌కు ప్రతి కేంద్రంలో అయిదుగురు సిబ్బంది ఉంటారు. ఇక మూడు గదులు ఏర్పాటు చేశారు. మొదటి గదిలో రిజిస్ట్రేషన్, రెండో గదిలో వ్యాక్సినేషన్, మూడో గదిలో పరిశీలన ఉంటుంది. ప్రతి సెంటర్‌లో ఎంపిక చేసిన 25మందికి డ్రై రన్‌ చేపట్టారు. కాగా లోపాలు గుర్తించి అధిగమించడమే డ్రై రన్‌ ప్రధాన లక్ష్యం.

పూర్ణ హార్ట్ ఇన్సిట్యూట్ హాస్పిటల్ లో కరోనా వాక్సిన్ డ్రై రన్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో కరోనా డ్రై రన్ సెంటర్ లో కోవిడ్ వాక్సినేషన్, వాక్సినేషన్ సెంటర్, పరిశీలన గది ఏర్పాటు చేశారు. ఫ్రెంట్ లైన్ వారియర్స్ ఆరోగ్య కార్యకర్తల లబ్దిదారుల జాబితా రూపొందించి వారి వివరాలను అధికారులు కో-విన్‌ (CO-WIN) యాప్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. వాక్సినేషన్ డ్రై రన్ ప్రక్రియని వీడియో  తీసి జిల్లా, రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ లకు నివేదిక అందించనున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ వాక్సినేషన్ సెంటర్‌ని పరిశీలించనున్నారు. 

అలానే తాడిగడప, ఉప్పులూరు పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభం అయ్యింది. మాక్ డ్రిల్‌లో భాగంగా అధికారులు 50 మందికి వాక్సినేషన్ ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ, శానిటరి, సచివాలయ సిబ్బందికి డ్రై రన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో డ్రై రన్ సెంటర్‌ని కోవిడ్ స్పెషల్  ఆఫీసర్ వినోద్ కుమార్ పర్యవేక్షించారు.


డ్రై రన్‌ అంటే?
నామమాత్ర పు(డమ్మీ) కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను డ్రై రన్‌గా వ్యవహరిస్తారు. ఇదొక మాక్‌ డ్రిల్‌ లాంటిదే.  టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, లోపాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రై రన్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్‌ ఇస్తారు.  

మరిన్ని వార్తలు