మానవతా థృక్పథంతో వైద్యసిబ్బంది ముందుకు రావాలి

27 Jul, 2020 17:10 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్ కమిటీ కొన్ని తీర్మానాలను చేసినట్లు మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో రోజుకు మూడు వేల మందికి కోవిడ్‌ టెస్ట్‌లు చేస్తున్నారు. వీటి సంఖ్య ఐదు వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. హోమ్‌ ఐసొలేషన్‌ ద్వారా వైద్యం అందించాలని భావిస్తున్నాము. ఐసీఎంఆర్‌ అనుమతితో మరికొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పరీక్షలకు అనుమతి ఇస్తాము. అత్యవసర వైద్యం అందించడానికి సిబ్బందిని నియమిస్తున్నాము. మానవతా థృక్పథంతో ఉన్న వైద్యసిబ్బంది కోవిడ్‌ సేవలు అందించడానికి ముందుకు రావాలి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వైద్యవిభాగంలో లోపాలు ఉన్నాయి. వాటిన్నిటినీ సరిదిద్దుకుంటూ ప్రజలకు కోవిడ్‌పై అవగాహన కల్పిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.  (ఎల్లో మీడియా క్షణక్షణం ప్రజల్ని భయపెడుతోంది)

ఆక్సిజన్‌ కొరత లేదు: కలెక్టర్‌
జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ మాట్లాడుతూ.. 400మంది ఇప్పటికే ఐసోలేషన్‌లో ఉన్నారు. రానున్నకాలంలో మరింత మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. జిల్లాలో ఆక్సిజన్‌ కొరత లేదు. ఇండస్ట్రియల్‌ ఆక్సిజన్‌ను మెడికల్‌ ఆక్సిజన్‌గా మారుస్తున్నాము. జిల్లాలో అదనంగా మొత్తం 22 ఆస్సత్రులు కోవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించాం. ఇప్పటికే 4వేల బెడ్స్‌ ఉన్నాయి. వీటిని 7వేల వరకు పెంచనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. (విశాఖకు తప్పిన మరో ప్రమాదం)

మరిన్ని వార్తలు