ఎంఎస్‌ఎంఈల్లో రాణిస్తున్న మహిళలు

7 Mar, 2023 09:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)ను సొంతంగా నిర్వహిస్తూ మహిళలు విజయవంతంగా రాణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఎంఎస్‌ఎంఈలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో మహిళలు ఎంఎస్‌ఎంఈలను ఏర్పాటు చేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే రాష్ట్రంలో అత్యధికంగా మహిళల యాజమాన్యంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం అందింది.

ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా గత మూడేళ్లలో క్రెడిట్‌ గ్యారెంటీ నిధి నుంచి ఈ ఆర్థిక సాయం అందించారు. 2020–21 నుంచి 2022–23 నవంబర్‌ వరకు రాష్ట్రంలో మహిళల యాజమాన్యంలోని 2.21 లక్షలకు పైగా ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్‌ గ్యారెంటీ నిధి నుంచి రూ.1,181.14 కోట్లు అందించినట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏపీలో మినహా గత మూడేళ్లలో మరే రాష్ట్రంలోనూ మహిళల యాజమాన్యంలోని ఎంఎస్‌ఎంఈలకు ఇంత పెద్ద సంఖ్యలో ఆర్థిక సాయం అందించలేదని తెలిపింది. ఆర్థిక సాయం ఇలా.. 2020–21లో దేశం మొత్తం మీద 1.71 లక్షల మహిళల యాజ­మాన్యంలోని ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్‌ గ్యారెంటీ నిధి నుంచి కేంద్రం ఆర్థిక సాయం అందించింది.

రాష్ట్రంలో అత్యధికంగా 74,339 ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సాయం లభించింది. ఏపీ తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్, తమిళనాడు నిలిచాయి. అలాగే 2021–22లో దేశం మొత్తం మీద మహిళల యాజమాన్యంలోని 1.30 లక్షల ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్‌ గ్యారెంటీ నిధి నుంచి ఆర్థిక సాయం అందించగా.. రాష్ట్రంలో అత్యధికంగా 22,641 ఎంఎస్‌ఎంఈలకు సాయం దక్కింది. ఏపీ తర్వాత మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌ నిలిచాయి. ఇక 2022–23లో నవంబర్‌ వరకు దేశం మొత్తం మీద మహిళల యాజమాన్యంలోని 2.34 లక్షల ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్‌ గ్యారెంటీ నిధి నుంచి ఆర్థిక సాయం అందగా రాష్ట్రంలో అత్యధికంగా 1.24 లక్షలకు పైగా ఎంఎస్‌ఎంఈలకు సాయం లభించింది. ఏపీ తర్వాత అత్యధికంగా సా­యం అందుకున్న రాష్ట్రాల్లో జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్‌ నిలిచాయని కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెరిగిన ఎంఎస్‌ఎంఈలు 2021–22లో మహిళల యాజమాన్యంలో ఎంఎస్‌ఎంఈలు 86.11% పెరిగినట్లు కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది.

2021 మార్చి 31 నాటికి మహిళల యాజమాన్యం­లో దేశంలో 4,89,470 ఎంఎస్‌ఎంఈలుండగా గతేడాది మార్చి 31 నాటికి వీటి సంఖ్య 9,10,973కు చేరింది. మహిళల యాజమాన్యంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు చేయూతనిస్తున్నాయని వెల్లడించింది. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల ద్వారా మొత్తం 19,59,778 మందికి ఉపాధి లభించినట్టు వివరించింది. ఎంఎస్‌ఎంఈలకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలతో పాటు పరిశ్రమలకు రాయితీలను ఇవ్వకుండా పెద్ద ఎత్తున బకాయిలు పెట్టింది.

సుమారు రూ.3,409 కోట్ల మేర టీడీపీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఎంఎస్‌ఎంఈలు కోలుకోలేని దెబ్బతి­న్నాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించి ఎంఎస్‌ఎంఈలను ఆదుకుంది. అంతేకాకుండా మూడేళ్లుగా ఎంఎస్‌ఎంఈలకు సకాలంలో రాయితీలను చెల్లిస్తోంది. గత మూడేళ్లలోనే రూ.1,706.16 కోట్లను రాయితీల కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అదేవిధంగా ఎంఎస్‌ఎంఈలను ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయిపట్టుకుని నడిపించేలా వ్యవహరిస్తోంది.

సీఎం రాయితీలు అందించడం వల్లే..


ఎంఎస్‌ఎంఈ పథకం కింద కార్ల కోసం పరిశ్రమల శాఖలో దరఖాస్తు చేసుకున్నా. నెల రోజుల్లోనే నాకు అనుమతి మంజూరైంది. రూ.14.50 లక్షలతో బొలేరో వాహనం, రూ.11.50 లక్షలతో బ్రిజా వాహనం కొనుగోలు చేశా. రెండు కార్లకు మొత్తం రూ.26 లక్షలు కాగా ఇందులో 45 శాతం సబ్సిడీ వచ్చింది. ఈ రెండు కార్లకు డ్రైవర్లను పెట్టుకొని బాడుగకు తిప్పుకుంటూ జీవనం సాగిస్తున్నా. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంఎస్‌ఎంఈలకు రాయితీలు అందించడం వల్లే పరిశ్రమలు వస్తున్నాయి. నాకు జీవనోపాధి కల్పిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ను ఎప్పటికీ మరిచిపోను.
–ఎస్‌ఎల్‌ శిరోమణి, జ్ఞానాపురం, నంద్యాల

(చదవండి: మీ తప్పు ఒప్పుకునేదెప్పుడు బాబూ? )

మరిన్ని వార్తలు