ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ లేఖ

22 Jan, 2021 20:30 IST|Sakshi

ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు..

సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌

సాక్షి, అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ పేర్కొన్నారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు సీఎస్‌ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన లేఖలో కోరారు. ‘‘ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ అవసరం. మొదటి డోస్‌కు, రెండో డోస్‌కు 4 వారాల వ్యవధి అవసరమని.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. మొదటి దఫా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాక.. 60 రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. చదవండి: సీఎస్‌ ఆదిత్యనాథ్ ‌దాస్‌తో ఉద్యోగ సంఘాల భేటీ

తొలి విడతలోనే ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ తప్పనిసరని కేంద్రం చెప్పింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ ఇవ్వడం సాధ్యం కాదు. ఇలా చేస్తే కేంద్రప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లే. ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలు రెండూ సజావుగా జరగాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని’’ సీఎస్‌ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేశామని.. సుప్రీంకోర్టులో విచారణ ముగిసేవరకు ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్లొద్దని సీఎస్‌ విజ్ఞప్తి చేశారు. చదవండి: గ్రామాల్లో అన్‌ లిమిటెడ్‌ ఇంటర్నెట్‌: సీఎం జగన్

>
మరిన్ని వార్తలు