31 నుంచి టీటీడీలో కరెంట్‌ బుకింగ్‌

31 Mar, 2022 04:38 IST|Sakshi

లక్కీ డిప్‌ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు

తిరుమల: కరోనా కారణంగా నిలిపివేసిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆఫ్‌లైన్‌లో లక్కీడిప్‌ ద్వారా భక్తులకు కేటాయించే కరెంట్‌ బుకింగ్‌ విధానం రెండేళ్ల విరామం తరువాత ఈ నెల 31న పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం సీఆర్‌వో జనరల్‌ కౌంటర్లలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.  

టికెట్ల కేటాయింపు ఇలా
► నిర్దేశించిన వివిధ ఆర్జిత సేవా టికెట్ల కోసం  తిరుమలలోని కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్‌లో ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల మధ్య నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
► రెండు అక్నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌లు వస్తాయి. ఒక స్లిప్‌ యాత్రికునికి ఇస్తారు. ఇందులో వారి నమోదు సంఖ్య, సేవ తేదీ, వ్యక్తి పేరు, మొబైల్‌ నంబర్‌ మొదలైనవి ఉంటాయి. మరో స్లిప్‌ను రిఫరెన్స్‌ కోసం కౌంటర్‌ సిబ్బంది ఉంచుకుంటారు.
► నమోదు చేసుకున్న గృహస్తుల సమక్షంలో సాయంత్రం 6 గంటలకు ఆటోమేటెడ్‌ ర్యాండమైజ్డ్‌ నంబరింగ్‌ సిస్టమ్‌ ద్వారా ఎల్‌ఈడీ స్క్రీన్లలో మొదటి డిప్‌ తీస్తారు. 
► శుక్రవారం అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ టికెట్లు కలిగి ఉన్న గృహస్తులు గురువారం రాత్రి 8 గంటలలోపు ఆర్జితం కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలి. 
► లక్కీడిప్‌లో టికెట్లు పొందిన గృహస్తులు వాటిని కొనుగోలు చేసేందుకు రాత్రి 11 గంటలలోపు  మొబైల్‌ నంబర్లకు సమాచారం తెలియజేస్తారు. టికెట్లు పొందని వారికి కూడా ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తారు.
► యాత్రికులు డిప్‌ విధానంలో అవకాశాన్ని పొందడం కోసం ఆటో ఎలిమినేషన్‌ ప్రక్రియ అమలవుతుంది.
► యాత్రికులు డిప్‌ విధానంలో ఏదైనా ఆర్జిత సేవ పొంది ఉన్నట్టయితే 6 నెలల వరకు తిరిగి వారు ఆర్జిత సేవలను పొందేందుకు అనుమతించరు.  
► సేవల నమోదు కోసం ఆధార్‌ తప్పనిసరి. ఎన్‌ఆర్‌ఐలైతే పాస్‌పోర్ట్‌ చూపాల్సి ఉంటుంది. యాత్రికులు ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డుతో స్వయంగా హాజరుకావాలి.
► కొత్తగా పెళ్లయిన జంటలకు నిర్ణీత కోటా ప్రకారం వివాహ కార్డు, లగ్న పత్రిక, ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డు సమర్పిస్తే కల్యాణోత్సవం టికెట్ల కేటాయింపు జరుగుతుంది. వివాహం జరిగి 7 రోజులు మించకుండా ఉండాలి. ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారు.

31 నుంచి అంగప్రదక్షిణం టోకెన్లు
అంగప్రదక్షిణం టోకెన్లను కూడా టీటీడీ పునరుద్ధరించింది.  ఈ నెల 31వ తేదీ నుంచి ఈ టోకెన్లు జారీ చేస్తారు. తిరుమలలోని పీఏసీ–1లోని రెండు కౌంటర్లలో ప్రతిరోజూ 750 టోకెన్లు జారీ చేస్తారు. సాధారణంగా శుక్రవారాల్లో అభిషేకం కారణంగా భక్తులకు దర్శనం లేకుండా అంగప్రదక్షిణకు మాత్రమే అనుమతిస్తారు. ఈ కారణంగా ఏప్రిల్‌ 1న శుక్రవారం అభిషేకం కారణంగా అంగప్రదక్షిణ భక్తులకు దర్శనం ఉండదు.  

మరిన్ని వార్తలు