సైబరాసురులు దోచేస్తున్నారు..కంపెనీల పేరులో వల

12 Dec, 2022 11:17 IST|Sakshi

‘ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఇంట్లోనే కూర్చుని నెలకు లక్షలాది రూపాయల్ని స్పందించే అవకాశం’ అంటూ విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన ఓ వివాహిత ఫోన్‌కు రెండు నెలల క్రితం మెసేజ్‌ వచ్చింది. ఆశతో మెసేజ్‌ కింద ఉన్న వెబ్‌లింక్‌ను క్లిక్‌ చేయగా.. ఓ ప్రముఖ కంపెనీ పేరిట వెబ్‌సైట్‌ తెరుచుకుంది. కంపెనీలో పెట్టుబడి పెట్టే వారికి లాభాలు పంచుతామని అందులో పేర్కొనడంతో.. ఆమె రూ.వెయ్యి పెట్టుబడి పెట్టింది. మరుసటి రోజున రూ.15 వేలు లాభం వచ్చినట్టు ఆమె పేరిట ఉన్న ఆ కంపెనీ వాలెట్‌లో ఆ మొత్తాన్ని జమ చేసినట్టు చూపించారు.

వాలెట్‌లోని నగదు విత్‌డ్రా చేయాలంటే మరో రూ.5 వేలు పెట్టుబడి పెట్టాలనే మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆమె రూ.5 వేలను పెట్టుబడి పెట్టింది. ఇలా ప్రతి రోజూ ఆమె పేరిట ఉండే వాలెట్‌లోని నగదు పెరగడం.. ఆ మొత్తాన్ని తీసుకోవాలంటే మరికొంత నగదు జమ చేయాలనే ఆంక్షల రూపంలో మెసేజ్‌లు రావడం పరిపాటిగా మారింది. ఇలా నెల రోజుల వ్యవధిలోనే ఆమె  వాలెట్‌లో 1,13,42,181 రూపాయలు చేరాయి.

ఈ నగదు తీసుకునే నిమిత్తం విడతల వారీగా రూ.9 లక్షలు సమర్పించాక మోసపోయానని గ్రహించిన ఆ మహిళ సైబర్‌ పోలీసులను ఆశ్రయించింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. భర్త చనిపోవడంతో టైలరింగ్‌ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. డబ్బులు వస్తే పిల్లల చదువుకు ఉపయోగపడతాయనే ఆశతో బంగారాన్ని అమ్మేసి మరీ సైబర్‌ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడుతోంది. విజయవాడ నగరంలో ఇలాంటి మోసాలకు సంబంధించి నెలకు సగటున 10 వరకు కేసులు నమోదవుతుండటంతో సైబర్‌ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 

ఆశ చూపి లూటీ చేస్తున్నారు 
అమెజాన్, ఈబే, లవ్‌ లైఫ్, క్రి΄్టో, స్నాప్‌ డీల్, ఫ్లిప్‌కార్ట్, ఓలా తదితర బడా కంపెనీల్లో స్వల్ప పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయంటూ పలువురి ఫోన్లకు మెసేజ్‌లు పంపించి సైబరాసురులు ఆకర్షిస్తున్నారు. ఇంట్లోనే కూర్చుని నెలకు రూ.లక్షలు సంపాదించవచ్చంటూ మెసేజ్‌ల ద్వారా సూచిస్తారు. నమ్మకం కుదరకపోతే రూ.లక్షలు సంపాదించిన వారి వీడియోలు చూడండి అంటూ.. వారే తయారు చేసిన కొన్ని వీడియోలను యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా లింక్‌లను పంపుతారు. మొత్తం ఆన్‌లైన్‌ అయిపోయిందని, భవిష్యత్‌ వ్యాపారం పూర్తిగా ఆన్‌లైన్‌ వేదికగానే జరుగుతుందంటూ ముగ్గులోకి దించుతారు.

ముందుగా రూ.100 పెట్టుబడి పెట్టి పరీక్షించుకోండంటూ బంపర్‌ ఆఫర్‌ ఇస్తారు. వారు పంపిన వెబ్‌లింక్‌ క్లిక్‌ చేయగానే వారే రూపొందించిన ఆయా కంపెనీల నకిలీ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తారు. తరువాత ఒక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తారు. అక్కడ మన కోసం ఒక వాలెట్‌ను రూ΄÷ందించి పెట్టుబడులను పలు రకాలైన ఆఫర్లతో ఆకర్షిస్తారు. రూ.100 పెట్టుబడి పెట్టిన 24 గంటల్లోపే లాభం రూ.1,500లకు పైగా వచ్చిందని వాలెట్‌లో చూపిస్తారు. ఆ నగదు మీ బ్యాంక్‌ ఖాతాకు చేరాలంటే మరో రూ.500 పెట్టుబడి పెట్టాలంటూ ఆంక్షలు విధిస్తారు. ఇలా వాలెట్‌లో నగదు అంకెలను పెంచుకుని΄ోతూ ఆశను పెంచేసి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షలు గుంజుతున్నారు.

అప్రమత్తంగా ఉండాలి 
క్యాష్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ తరహా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి. కేసులు నమోదు చేసి సైబర్‌ నేరగాళ్ల బ్యాంక్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తున్నాం. ఈ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజలు అవసరం లేని వెబ్‌లింక్‌ల జోలికి ;పోకూడదు.   
– యేలేటి శ్రీరచన, ఎస్‌ఐ, సైబర్‌ క్రైం, విజయవాడ

(చదవండి: భారతీయ చిన్నారులు బాగా ‘స్మార్ట్‌’ )

>
మరిన్ని వార్తలు