ఎన్నికల కమిషన్‌ నిర్ణయంతో.. 3 లక్షల మందికి నష్టం

25 Jan, 2021 03:43 IST|Sakshi

ఓటు హక్కు కోల్పోతున్నందున నోటిఫికేషన్‌ అమలును నిలిపేయండి

హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్న గుంటూరు విద్యార్థిని

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను 2019 ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించడంవల్ల దాదాపు 3 లక్షల మంది తమ ఓటు హక్కును కోల్పోతున్నారని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఎన్నికల కమిషన్‌కు తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలయ్యే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయనున్నారు.

కొత్తగా ఓటు హక్కు వచ్చిన తమకు దానిని వినియోగించుకునే అవకాశం కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానానికి అఖిల  నివేదించనున్నారు. ఎన్నికల కమిషన్‌ నిర్ణయంవల్ల తనలాగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన 3 లక్షల మంది నష్టపోతారని వివరించనున్నారు. 18ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని రాజ్యాంగంలోని అధికరణ 326 కల్పిస్తోందని తెలుపనున్నారు. అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎన్నికల నోటిఫికేషన్‌ అమలును నిలిపేస్తూ ఉత్తర్వులివ్వాలని ఆమె కోరనున్నారు.  

మరిన్ని వార్తలు