ఆంధ్రా విశ్వవిద్యాలయంలో కరోనా కలకలం

27 Mar, 2021 14:10 IST|Sakshi

విశాఖ: మహమ్మారి కరోనా వైరస్‌ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో కలకలం రేపుతోంది. మొత్తం 65 మంది విద్యార్థులకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మిగతా విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కంటైన్‌మెంట్‌ జోన్‌లోకి ఇంజినీరింగ్‌ క్యాంపస్‌లోని 7 బ్లాక్‌లను చేర్చారు. క్వారంటైన్‌లో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వసతిగృహాలు చేశారు. 

విజయవాడ నుంచి వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థికి తొలి కరోనా కేసు నమోదైంది. దీంతో ఏయూలో 800 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వారిలో 59 మందికి పాజిటివ్ తేలింది. ఈ సమాచారంతో గ్రేటర్ విశాఖ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వసతిగృహాలను సందర్శించారు. కరోనా కేసులు రావడంతో ఏయూలో నేడు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. పరీక్షల తేదీల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా హాస్టల్స్ వద్ద ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేస్తామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విశాఖ ఆర్డీఓ కిశోర్ చెప్పారు. కరోనా వచ్చిన వారిలో తక్కువగానే పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని, హాస్టల్స్‌లో ప్రత్యేక గదుల్లో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆర్డీఓ వివరించారు. వెయ్యి మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. మరికొంతమంది రిజల్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

మంత్రి ఆళ్ల నాని ఆరా
విశాఖ ఏయూలో కరోనా కేసులపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. వైద్యారోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఏయూలో 65 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయినట్లు గుర్తించారు. దీంతో విశాఖ డీఎంహెచ్‌ఓ సూర్యనారాయణతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. రోజు 7,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 6 కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్‌ఓ మంత్రికి వివరించారు. కోవిడ్ ఆస్పత్రులో వెయ్యి బెడ్లు సిద్ధం చేశామని, కరోనా సోకిన 15 మంది కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల వైద్యాధికారులను అప్రమత్తం చేశామని, కరోనా నివారణ చర్యలపై టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి ఆళ్ల నాని సమీక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు