గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సవరించిన హైకోర్టు
30 శాతం యాజమాన్య సీట్ల భర్తీ వద్దని ఆదేశం
జీవో 55పై తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం
సాక్షి, అమరావతి: డిగ్రీ కాలేజీల్లో సీట్ల కేటాయింపు జరపవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. వీటిలో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేసుకోవచ్చని తెలిపింది. 30 శాతం యాజమాన్య సీట్లను భర్తీ చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
డిగ్రీ కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద, 30 శాతం యాజమాన్య కోటా కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 55పై తీర్పును రిజర్వ్ చేసింది. జీవో 55ను సవాలు చేస్తూ మాల మహానాడు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం రామారావు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.