ఫోన్ల వినియోగంలో ఢిల్లీదే అగ్రస్థానం

27 Nov, 2022 05:10 IST|Sakshi

దేశ రాజధానిలో నూరు జనాభాకు 267.63 ఫోన్ల వాడకం

143.38 ఫోన్ల వినియోగంతో రెండో స్థానంలో కోల్‌కత్తా

ముంబైలో నూరు జనాభాకు 139.95 ఫోన్ల వాడకం

హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రతి వంద మందికి 138.44 వినియోగం

అత్యల్పంగా బిహార్‌లో 52.87 ఫోన్ల వాడకం

2022 మార్చి వరకు గణాంకాలను వెల్లడించిన ఆర్‌బీఐ

సాక్షి, అమరావతి: ఫోన్ల వినియోగంలో దేశంలోనే ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. అక్కడ ప్రతి వంద మందికి 267.63 ఫోన్లు వినియోగిస్తున్నట్టు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ తరువాత కోల్‌కత్తాలో ప్రతి వంద మంది జనాభాకు 143.38 ఫోన్లు వినియోగిస్తుండగా.. ముంబైలో 139.95, హిమాచల్‌ ప్రదేశ్‌లో 138.44 చొప్పున ఫోన్లు వినియోగంలో ఉన్నాయి. ఈ మేరకు ఆర్‌బీఐ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2022 మార్చి నాటికి దేశంలో ప్రతి వంద మంది జనాభాకు ల్యాండ్‌ ఫోన్లు, సెల్‌ ఫోన్లు, ఇతర ఫోన్లు అన్నీ కలిపి 84.87 ఉన్నట్టు స్పష్టమైంది. 

ఏపీలో 93.63% వినియోగం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వంద మందికి 93.63 ఫోన్లు ఉన్నట్టు ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. దేశంలోనే అత్యల్పంగా ఫోన్లను వినియోగిస్తున్న రాష్ట్రంగా బిహార్‌ స్థానం దక్కించుకుంది. అక్కడ ప్రతి వంద మందికి 52.87 ఫోన్లు వినియోగిస్తున్నారు. 2019  నాటికి దేశవ్యాప్తంగా ప్రతి వంద జనాభాకు 90.10 ఫోన్లు ఉండగా.. 2022 మార్చి నాటికి ఆ సంఖ్య 84.87కు తగ్గడం గమనార్హం. 

మరిన్ని వార్తలు