బొంగులో బిర్యానీ.. చికెన్, బాస్మతి రైస్‌తో అబ్బ! ఏమి రుచి..! ధరెంతో తెలుసా?

7 Feb, 2022 21:23 IST|Sakshi

అనంతగిరి(విశాఖ జిల్లా): మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో బొంగు చికెన్‌  దొరకని ప్రదేశమే ఉండదు. బొంగు చికెన్‌కు అంత డిమాండ్‌ ఉంది. దీంతో పాటుగా ప్రస్తుతం బొంగు బిర్యానీకి కూడా అంతే డిమాండ్‌  పెరిగింది. మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలను సందర్శించేందుకు  వస్తున్న పర్యాటకులకు, బొర్రా హోటల్‌ నిర్వహకులు బొంగు బిర్యానీని రుచి చూపిస్తున్నారు. బొంగుచికెన్‌ మాదిరిగానే బొంగు బిర్యానీ కూడా  ఫేమస్‌ అయింది. మన్యంలోని  పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.


బొర్రా హోటల్‌లో తయారుచేస్తున్న బొంగు బిర్యానీ

మన్యంలో దొరికే ఆహారంపై మొగ్గు చూపుతుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని, స్థానికంగా ఉన్నవారు పర్యాటకులకు కొత్త రుచులను పరిచయం చేస్తున్నారు. బొర్రా గుహలను తిలకించేందుకు భారీగా తరలివచ్చే పర్యాటకుల కోసం హోటల్స్‌ వద్ద బొంగుచికెన్‌తో పాటుగా బొంగు బిర్యానీని అందుబాటులో ఉంచుతున్నారు. హోటల్‌లో ఇచ్చే ఒక బొంగు బిర్యానీ  ఇద్దరికి సరిపోతుంది.

దీని ధర రూ.500 నుంచి రూ. 600 వరకు ఉంది. చికెన్, బాస్మతి రైస్‌తో కలిపి ఎంతోరుచిగా దీనిని తయారు చేస్తున్నారు. బిర్యానీలో  ఎన్నోరకాలు ఉండగా, పర్యాటక ప్రాంతాల్లో దొరికే బొంగు బిర్యానీ రుచే వేరంటూ పర్యాటకులు లొట్టలేసుకుని తింటూ కితాబు ఇస్తున్నారు. బొంగు బిర్యానీని రుచి చూడాలంటే మరెందుకు  లేటు బొర్రా రావలసిందే.
చదవండి: 20 సినిమాలకు పైగా షూటింగ్‌.. జానకిరాముడు, ప్రేమదేశం తీసింది అక్కడే..

మరిన్ని వార్తలు