పథకాల వర్తింపులో అర్హతే గీటు రాయి
గ్రామ, వార్డు సచివాలయాల రాష్ట్ర శాఖ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: వివిధ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తోందని, వివక్షకు, పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ పథకాలు వర్తింపజేయడంతో పాటు అనర్హులకు చెందకూడదన్న లక్ష్యంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నదని గ్రామ, వార్డు సచివాలయాల రాష్ట్ర శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. సంక్షేమ పథకాల అమలులో నిధులు దారి మళ్లాయని కొంతమంది చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజల కోసం చేసే ఖర్చు ఎప్పుడూ దారి మళ్లినట్లు కాదని పేర్కొంది.
అర్హతలను వర్తింపజేసేటప్పుడు ఒక ఏడాది అర్హుడిగా తేలిన వ్యక్తి.. ఆ తర్వాత ఏడాది అనర్హుడు కావొచ్చునని, వారి జీవన ప్రమాణాలు పెరిగి ఉండవచ్చునని లేదా ఉన్న ఉద్యోగం కోల్పోయి జీవన ప్రమాణాలు మరింత తగ్గవచ్చునని, వయసు పెరగ వచ్చు లేదా మృతి చెంది ఉండవచ్చునని పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో పాత వాళ్లు కొంత మంది అర్హత కోల్పోవడం..కొత్తవాళ్లు కొంత మంది అర్హత సాధించడం సర్వసాధారణమైన అంశమని, ఇది ఏటా జరిగే ప్రక్రియేనని వివరించింది.