'సుబ్బయ్య హత్యపై శవరాజకీయం చేస్తున్నారు'

30 Dec, 2020 18:29 IST|Sakshi

సాక్షి, కడప : ప్రొద్దుటూరులో జరిగిన టీడీపీ నేత సుబ్బయ్య హత్య పై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా స్పందించారు. 'హత్యా రాజకీయాలు అధికార పార్టీ నాయకులు చేస్తున్నారని చంద్రబాబు, లోకేష్ చెప్పడం సిగ్గుచేటు. ఈ హత్య పై వారిద్దరు శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. చెరుకులపాడు నారాయణను ఎవరు హత్య చేశారు. ఈ హత్యపై లోతైన విచారణ జరిపిస్తాం. ఆ హత్య ఎవరు చేశారో అప్పటి ప్రజలతో పాటు నాయకులకు తెలుసు. దివంగత రాజారెడ్డి హత్య కేసులో నిందితులకు క్షమాభిక్ష పెట్టారు. కులాలను ,మతాలను అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు కుల రాజకీయాలు, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు.

టీడీపీ నేత సుబ్బయ్య పై మొత్తం 14 క్రిమినల్ కేసులు ఉన్నాయి. గత టీడీపీ హాయంలో ఇదే సుబ్బయ్య పై 4 క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇవన్నీ టీడీపీ నాయకులకు తెలియదా...? బాధ్యతాయుమైన ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు శవ రాజకీయాలు చేయడం తగదు. రాష్ట్రంలో ఏ మూలన ఏ చిన్న గొడవ జరిగినా అధికార పార్టీ పై వేయాలని చూడటం దారుణం.

మా ప్రభుత్వం అధికారంలోకి జిల్లాలో వచ్చాక కేవలం 51 హత్యలు వివిద కారణాలు వల్ల జరిగాయి.. పారదర్శకంగా పాలన సాగిస్తుంటే విమర్శలు చేయడం దుర్మార్గం. సుబ్బయ్య భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య చేశారని భావిస్తున్న వ్యక్తి గతంలో సుబ్బయ్య కు స్నేహితుడు. ఇప్పుడు మాట్లాడుకోవడం లేదని హత్య ను వైసీపీ నేతలపై వేయడం ఎంతవరకు సమంజసమంటూ' ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు